Vijay Jagarlamudi: అవార్డు సినిమా తీసి ఆసుపత్రిపాలైన సినీ నిర్మాత

  • యువ రక్తం పొంగిపొర్లే వయసులో బ్రిటీష్ వారిని ఎదిరించిన ఖుదీరామ్ బోస్
  • ఖుదీరామ్ బోస్ జీవితచరిత్రను సినిమాగా రూపొందించిన వైనం
  • నిర్మాతగా వ్యవహరించిన విజయ్ జాగర్లమూడి
  • పలు వేదికలపై ఖుదీరామ్ బోస్ చిత్రానికి గుర్తింపు
  • ఇంతవరకు విడుదలకు నోచుకోని చిత్రం
  • తీవ్ర వేదనతో గుండెపోటుకు గురైన నిర్మాత విజయ్ జాగర్లమూడి
Producer Vijay Jagarlamudi hospitalized

యువ ప్రాయంలోనే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్. అలాంటి మహనీయుడి జీవితంపై తీసిన సినిమాను విడుదల చేయలేకపోవడం నిర్మాత విజయ్ జాగర్లమూడిని కలచివేసింది. ఎంతో తపనతో తీసిన సినిమా మూలనపడిందన్న వేదనతో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొందిన విజయ్ జాగర్లమూడి నిర్మాతగా మారి, స్వాతంత్య్రం కోసం చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడిపై సినిమా తీశారు. సినిమాను విడుదల చేయలేక, ఆర్థిక భారాన్ని తట్టుకోలేక విజయ్ జాగర్లమూడి గుండెపోటుకు గురవడం కలచివేస్తోంది. 

స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల కోసం చిన్న వ‌య‌సులోనే ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి ఖుదీరామ్ బోస్‌. బ‌యోపిక్స్ ట్రెండ్‌లో పాన్ ఇండియా మూవీగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజ‌య్ జాగర్ల‌మూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవ‌ల గోవాలో జ‌రిగిన ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో ప్ర‌దర్శించ‌గా చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. 2022 డిసెంబ‌ర్ 22న  ‘ఖుదీరామ్ బోస్‌’ చిత్రాన్ని పార్లమెంట్‌ సభ్యులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. కానీ... సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు.

కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల ఒత్తిడితో నిర్మాత విజయ్ జాగర్లమూడి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేశారు.

సంగీత దర్శకుడిగా మణిశర్మ, ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ తోట త‌ర‌ణి, స్టంట్ డైరెక్ట‌ర్‌గా క‌న‌ల్ క‌న్న‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌గా ర‌సూల్ ఎల్లోర్, ఎడిట‌ర్‌గా మార్తాండ్ కె.వెంక‌టేష్ వ‌ర్క్ చేశారు. 

ఖుదీరామ్ బోస్ గురించి ఈ తరం వారికి తెలియకపోవటం, కమర్షియల్ సినిమాల మధ్య ఇలాంటి బయోపిక్ సినిమాలకు పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి ఆదరణ లేకపోవడం నిర్మాత ఈ దుస్థితిలో చిక్కుకోవడానికి కారణం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News