పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు
- ప్రజలు తుపాకులతో ఒకరినొకరు కాల్చుకుంటున్నారని వ్యాఖ్యలు
- పాకిస్థాన్, సిరియాలోనే ఇలాంటివి కనిపిస్తాయని విమర్శలు
- ప్రధాని మోదీపైనా విమర్శలు
‘‘వారు అన్ని చోట్లా ఎంతటి ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారో చూడండి. సాధారణ ప్రజలు తుపాకులు తీసుకుని ఒకరినొకరు కాల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటివి మనం పాకిస్థాన్ లో చూస్తున్నాం. ఇలాంటివి సిరియాలో జరుగుతున్నాయి. అక్కడ అల్లాహు అక్బర్ అంటూ ప్రజలను చంపేస్తుంటారు. ఇక్కడ జైశ్రీరామ్ అంటూ చంపేస్తున్నారు. ఇందులో తేడా ఏంటి?’’అని ఓ మీడియా సంస్థతో అన్నారు.
ప్రజలు తుపాకులతో కాల్చుకునే స్థాయికి దేశాన్ని తీసుకొచ్చారంటూ ప్రధాని మోదీపై ముఫ్తీ విమర్శలు కురిపించారు. విపక్షాల ఇండియా కూటమిపై మాట్లాడుతూ.. గాడ్సే ఇండియా.. గాంధీ, నెహ్రూ, పటేల్ కలలుగన్న ఇండియా మధ్య పోరాటంగా పేర్కొన్నారు. బీజేపీ ఇక్కడ గాడ్సేలను సృష్టించాలని చూస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాల నేతలను లక్ష్యం చేసుకునేందుకు బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగిం చేస్తోందని ఆరోపించారు.