Love Torture: మరో యువతిపై కన్నేసిన భర్త.. దగ్గరుండి పెళ్లి జరిపించిన భార్య.. ఆపై వేధింపులు!

  • హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
  • డ్యాన్స్‌ స్కూలుకు వచ్చే యువతితో పెళ్లయిన యువకుడి ప్రేమాయణం
  • పెళ్లయ్యాక భార్యతో కలిసి యువతికి వేధింపులు
A Man Marries A Girl With The Help Of His Wife

పెళ్లయిన యువకుడు మరో యువతిపై కన్నేశాడు. విషయం తెలిసిన అతడి భార్య సుద్దులు చెప్పాల్సింది పోయి అబద్ధాలు చెప్పి మరీ యువతిని మచ్చిక చేసుకుని భర్తతో వివాహం చేసింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. సింగాడికుంటకు చెందిన దీప్తి యూసుఫ్‌గూడలో ఓ డ్యాన్స్ స్కూలుకు వచ్చేది. అక్కడ ఆమెకు హోంట్యూషన్లు చెప్పే కరజాడ గాంధీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అది మరింతగా ముదరడంతో ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడికి పెళ్లయిన విషయం తెలియని ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించింది.

పెళ్లి నిశ్చయమైన తర్వాత గాంధీ వ్యవహార శైలిలో మార్పును దీప్తి కుటుంబం గమనించింది. రోజాతో అతడికి సంబంధం ఉన్నట్టు తెలిసి నిలదీస్తే అదేమీ లేదని కొట్టిపడేశాడు. ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య గొడవ జరగడంతో పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో తాను గాంధీ స్నేహితురాలిని మాత్రమేనని, ఆయనకు తనకు మధ్య మరే సంబంధమూ లేదని రోజా చెప్పుకొచ్చింది. తానే దగ్గరుండి గాంధీకి, దీప్తికి వివాహం చేస్తానని చెప్పింది. ఆమె మాటలపై నమ్మకంతో దీప్తి కుటుంబ సభ్యులు కేసును వెనక్కి తీసుకున్నారు. 

మే 14న దీప్తి, గాంధీ వివాహం జరిగింది. నాలుగైదు రోజులపాటు కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత గాంధీ రోజూ రాత్రి పొద్దుపోయాక వస్తుండడంతో దీప్తి నిలదీసింది. ఆ తర్వాత రోజా కూడా వచ్చి వారితో ఉండడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి దీప్తిని వేధించడం మొదలుపెట్టారు. వారి చిత్రహింసలు భరించలేని దీప్తి నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటికీ వదలని రోజా.. తన మనుషులతో కలిసి దీప్తి ఇంటికి వెళ్లి గొడవ చేసేది.  దీంతో రోజాకు, గాంధీకి ఉన్న సంబంధం ఏంటా? అని దీప్తి కుటుంబ సభ్యులు ఆరా తీస్తే అసలు విషయం తెలిసి షాకయ్యారు. రోజా, గాంధీ ఇద్దరూ భార్యాభర్తలని తేలడంతో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News