Pawan Kalyan: ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే ఆయన వాగ్ధాటి పార్లమెంటును అబ్బురపరిచేది: పవన్ కల్యాణ్

  • నేడు మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతి  
  • ఆయనకు నివాళులర్పించిన పవన్
  • దేశం కోసం పుట్టిన మహానుభావుల్లో అటల్ ప్రముఖులన్న జనసేన అధినేత
Pawankalyan remembers former PM Vajpayee on his death anniversary

భారత మాజీ ప్రధాన మంత్రి,  దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసమే పుట్టిన ఎందరో మహానుభావుల్లో వాజ్‌పేయిని ప్రముఖంగా చెప్పుకోవచ్చన్నారు. అరుదైన నాయకుడి వర్ధంతి సందర్భాన ఆ మహానాయకునికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని పేర్కొన్నారు. జనసేన పక్షాన ఆయనకు నివాళులు అర్పించారు. 

‘ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే వందలు వేలకోట్ల ఆస్తులను సంపాదించే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో మూడుసార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పని చేసినప్పటికీ చరమాంకంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహంలోనే తనువు చాలించిన వాజ్‌పేయి గురించి ఏమని చెప్పాలి. అందుకేనేమో ఆయన భారతరత్నగా అందరి గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. ప్రధానమంత్రిగా ఆయన హయాంలో భారత దేశం ఎన్నో విజయాలను చవిచూసింది. అణుపరీక్షలు జరిపి భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా నిలిపింది ఆయనే’ అని పవన్ తన సందేశంలో కొనియాడారు.

More Telugu News