Nitish Kumar: బీహార్ సీఎం ప్రసంగిస్తుండగా దూసుకొచ్చిన యువకుడు... ఉద్యోగం వస్తుందని ఇలా చేశాడట!

  • ముఖ్యమంత్రి నితీశ్ హైసెక్యూరిటీ జోన్‌లోకి దూసుకొచ్చిన యువకుడు
  • 1996లో డ్యూటీలో తన తండ్రి చనిపోయాడని వెల్లడించిన నితీశ్ మండల్
  • కారుణ్య నియామకం కోసమే అలా చేశానని వెల్లడించిన యువకుడు
Man breached Nitishs security for job

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతుండగా ఓ వ్యక్తి హైసెక్యూరిటీ జోన్‌లోకి దూసుకు వచ్చాడు. దీంతో భద్రతా సిబ్బంది అతనిని వెంటనే అదుపులోకి తీసుకుంది. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నితీశ్ కుమార్ ప్రసంగిస్తున్నారు. ఈ సమయంలో ఓ యువకుడు హైసెక్యూరిటీ జోన్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు.

వెంటనే భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతనిని ముంగేర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల నితీశ్ మండల్‌గా గుర్తించారు. నితీశ్ మండల్ ఓ పోస్టర్‌ను పట్టుకొని దూసుకు వచ్చే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అయితే అతను కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోసం విజ్ఞప్తి చేసే ఉద్దేశ్యంతోనే వచ్చినట్లు గుర్తించారు. సీఎం సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిని పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు.

తన తండ్రి రాజేశ్వర్ మండల్ బీహార్ మిలిటరీ పోలీస్ జవాన్ అని, 1996 ఎన్నికల సమయంలో డ్యూటీలోనే మృతి చెందారని నితీశ్ మండల్ తెలిపాడు. తన తండ్రి ఎన్నికల విధుల నుండి తిరిగి వస్తుండగా పేలుడు సంభవించిందన్నారు. ఈ నేపథ్యంలో తాను ముఖ్యమంత్రిని కలిసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపాడు. చాలా రోజులుగా వేచి చూస్తున్నానని, కనీసం ఇలాగైనా వెళ్తే ముఖ్యమంత్రి దృష్టిలో పడి, తనకు ఉద్యోగ సమస్య తీరుతుందని తనకు కొంతమంది చెప్పారని, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పాడు. తన తండ్రి చనిపోయినప్పుడు తాను మైనర్ బాలుడినని, అందుకే అప్పుడు ఉద్యోగం రాలేదన్నాడు.

More Telugu News