TTD: కాలినడకన వెళ్లే భక్తులకు చేతికర్ర... ఆ సమయంలోనే అనుమతి: భూమన

  • భక్తుల రక్షణే తమకు ముఖ్యమన్న టీటీడీ చైర్మన్ భూమన
  • మధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలకు అనుమతిస్తామని వెల్లడి
  • నైపుణ్యం కలిగిన ఫారెస్ట్ సిబ్బందిని సెక్యూరిటీగా నియమిస్తామన్న టీటీడీ చైర్మన్
  • దుకాణదారులు వ్యర్థపదార్థాలు బయటపారవేస్తే చర్యలు
  • జంతువులకు తినడానికి భక్తులు ఏమీ ఇవ్వవద్దని సూచన
TTD Chairman Bhumana about Tirumala devotees safe

తమకు భక్తుల రక్షణే ముఖ్యమని, ఇందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. భూమన అధ్యక్షతన టీటీడీ హైలెవల్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం భూమన మాట్లాడుతూ... భక్తులపై చిరుత దాడి ఘటనపై చర్చించినట్లు చెప్పారు. అలిపిరిలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలను అనుమతిస్తామని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతించమన్నారు. భక్తుల భద్రతకు నైపుణ్యం కలిగిన ఫారెస్ట్ సిబ్బందిని సెక్యూరిటీగా నియమిస్తామన్నారు. నడకమార్గంలో సాధుజంతువులకు తినడానికి భక్తులు ఏమీ ఇవ్వకూడదని, అలా ఇచ్చినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నడక దారిలోని దుకాణాదారులు వ్యర్థపదార్థాలను బయట పారవేస్తే చర్యలు ఉంటాయన్నారు.

భక్తుల భద్రత కోసం డ్రోన్లు వాడాలని నిర్ణయించినట్లు చెప్పారు. భద్రతపై భక్తులకూ అవగాహన కల్పిస్తామన్నారు. అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాలి నడకన వెళ్లే ప్రతి భక్తుడికి కర్ర ఇస్తామన్నారు. తిరుపతి - తిరుమల మధ్యలో 500 కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. నడక దారిలో బేస్ క్యాంపు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. మెట్ల మార్గంలో ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల వరకే టూవీలర్స్‌కు అనుమతి ఇస్తామన్నారు. పెద్దలకు రాత్రి పది గంటల వరకే నడకదారిలో అనుమతి ఉంటుందన్నారు. ఫెన్సింగ్ ఏర్పాటుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇందుకు టీటీడీ సిద్ధంగా ఉందని, కానీ అటవీశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అటవీశాఖ నిబంధనలు కఠినంగా ఉంటాయని గుర్తు చేశారు.

More Telugu News