WWE: హైదరాబాదులో డబ్ల్యూడబ్ల్యూఈ వినోదం... పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • భాగ్యనగరానికి తరలివస్తున్న డబ్ల్యూడబ్ల్యూఈ
  • సెప్టెంబరు 8న ఈవెంట్
  • వేదికగా నిలవనున్న జీఎంసీ బాలయోగి స్టేడియం
WWE event will be held in Hyderabad on September 8

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టయిన్ మెంట్... సంక్షిప్తంగా డబ్ల్యూడబ్ల్యూఈ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా పాప్యులారిటీ సంపాదించుకున్న ఈ వినోదాత్మక ఈవెంట్ హైదరాబాద్ కు వస్తోంది. 

భారత్ లో సోనీ టెన్ స్పోర్ట్స్ చానళ్లలో ప్రసారమయ్యే డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కండలు తిరిగిన వస్తాదులు తమ కుస్తీ, ఇతర పోరాట విన్యాసాలతో వీక్షకులకు వినోదం పంచుతారు. బాక్సింగ్ తరహా రింగ్ లో వారు చేసేది డమ్మీ పోరాటాలే అయినా, ఎంతో థ్రిల్ అందిస్తాయి. అందుకే పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు WWEకి అభిమానులుగా మారుతుంటారు. 

కాగా, హైదరాబాద్ నగరంలోనూ ఈ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టయిన్ మెంట్ ఈవెంట్ కు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను తెలంగాణ క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. 

హైదరాబాదులో నిర్వహించే ఈ WWE ఈవెంట్ పేరు సూపర్ స్టార్ స్పెక్టాకిల్-2023 అని శ్రీనివాస్ గౌడ్ ట్విట్టర్ లో వెల్లడించారు. సెప్టెంబరు 8న గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుందని తెలిపారు. 

WWE పురుషుల వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్ సేత్ ఫ్రాంక్లిన్ రోలిన్స్, మహిళల వరల్డ్ చాంపియన్ రియా రిప్లేతో పాటు WWE ట్యాగ్ టీమ్ చాంపియన్స్ సమీ జేన్, కెవిన్ ఓవెన్స్... ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్ ది రింగ్ జనరల్ గుంతర్, జిందర్ మహల్, వీర్, సంగా, డ్రూ మెకింటైర్, బెకీ లించ్, నటాల్యా, మాట్ రిడిల్, లుడ్విగ్ కైజర్ తదితర WWE సూపర్ స్టార్లు హైదరాబాదుకు రానున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

More Telugu News