Undavalli Sridevi: లోకేశ్ ఎదుట కన్నీటి పర్యంతమైన ఉండవల్లి శ్రీదేవి... వీడియో ఇదిగో!

  • తాడికొండ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • అమరావతి ఆక్రందన పేరిట అమరావతి రైతులతో ముఖాముఖి 
  • వ్యాఖ్యాతగా వ్యవహరించిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
  • పార్టీ తనను రోడ్డున పడేసిందన్న శ్రీదేవి
  • లోకేశ్ మద్దతు పలికారని వెల్లడి
Undavalli Sridevi gets emotional in front of Nara Lokesh

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాడికొండ నియోజకవర్గంలో అమరావతి ఆక్రందన పేరిట అమరావతి రైతులతో సమావేశం నిర్వహించారు. రావెలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 

ఈ ముఖాముఖి సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. ఓ దశలో లోకేశ్ సమక్షంలో కన్నీటి పర్యంతమయ్యారు. తన ప్రసంగంలో ఉండవల్లి శ్రీదేవి ఏమన్నారంటే... అమరావతి రైతులు ధైర్యంగా ఉండాలని, అమరావతి అంటే చంద్రబాబు, అమరావతి అంటే లోకేశ్ అని, వారిద్దరూ అమరావతి రైతుల వెన్నంటే ఉంటారని, ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రైతులను వదిలివేయరని స్పష్టం చేశారు. 

ఉండవల్లి శ్రీదేవి ఎలా తిరుగుతుందో చూస్తామని కొందరు అన్నారని, కానీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ద్వారా లోకేశ్ కొండంత భరోసా ఇచ్చారని, నేను ఎలా తిరగ్గలనో ఇప్పుడు వారికి అర్థమై ఉంటుందని అన్నారు. పార్టీ  కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కానీ తనను రోడ్డున పడేశారని ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

కార్యకర్తలతో ఫోన్లు చేయించి, రకరకాలుగా చిత్రవధ చేశారని కంటతడి పెట్టుకున్నారు. కానీ, నేను ఎప్పుడూ చూడని లోకేశ్ గారు... శ్రీదేవి గారికి మేం మద్దతిస్తాం అని చెప్పారు... అందుకు ఆయనకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని వెల్లడించారు.

More Telugu News