Chandrababu: ఏపీ విషయంలో జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ

  • రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడి
  • జగన్ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని ఆరోపణ
  • మానవ హక్కుల ఉల్లంఘన సాధారణంగా మారిందంటూ ఆవేదన
  • రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీకి 9 పేజీల లేఖ రాసిన టీడీపీ చీఫ్
TDP Chief Chandrababu letter to President Of India and PM Modi

ఆంధ్రప్రదేశ్ లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని, తన విశేషాధికారాలతో పరిస్థితిని చక్కదిద్దాలని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆయన లేఖ రాశారు. తొమ్మిది పేజీల ఈ సుదీర్ఘ లేఖలో జగన్ పాలనలో ఏపీ ప్రజలు, ప్రతిపక్ష నేతలు ఎదుర్కొంటున్న పరిస్థితులతో పాటు రాజ్యాంగ సంస్థలపై దాడులను చంద్రబాబు ప్రస్తావించారు. జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత ఏపీలో హింస, అరాచకం, మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ జగన్ సర్కారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. మతిస్థిమితంలేని వ్యక్తిగా జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని లేఖలో విమర్శించారు.

దాడులు చేసి తప్పుడు కేసులు..
ఇటీవల చిత్తూరులో పర్యటిస్తుండగా తనపై దాడి జరిగిందని, పోలీసులు తనపైనే కేసు పెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను లేఖలో వివరించారు. జగన్ పాలనలో తనపై జరిగిన దాడుల వివరాలను ఏకరువు పెట్టారు. ఈ దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతి, ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ప్రజావేదిక కూల్చివేత, రాజధాని విధ్వంసం, న్యాయమూర్తులు, కోర్టులపై సోషల్ మీడియా ద్వారా దాడులు, ఎస్ఇసి, ఎపీపీఎస్సీ చైర్మన్ లపై వేధింపులు, దేవాలయాలపై దాడులు, శాంతి భద్రతలు, గంజాయి అమ్మకాలు, దొంగ ఓట్ల రాజకీయాలు, మహిళలు, దళిత గిరిజన మైనారిటీ బలహీన వర్గాలపై దాడులు, అక్రమ కేసులు, మీడియాపై దాడులు వంటి పలు అంశాలను చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. వీటికి సంబంధించి 75 పేజీల అనుబంధ డాక్యుమెంట్ ను లేఖకు జతచేశారు.

లేఖలోని ప్రధాన అంశాలు..
• 2019 మేలో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తన 'విధ్వంసక పాలన'ను ఆవిష్కరించారు. ప్రజల సొమ్ముతో కట్టిన 'ప్రజా వేదిక'ని కూల్చివేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని వినాశకర నిర్ణయాలతో నాశనం చేశాడు.
• జగన్ నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పటికీ సొంత రాజధాని లేకుండా పోయింది. మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి తన పంతం కోసం మండలిని రద్దు చేసేందుకు సిద్దమయ్యారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను వివిధ మార్గాలతో తప్పించుకుంటున్నాడు. ఇందుకోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడు. తన పార్టీ క్యాడర్ తో సోషల్ మీడియాలో న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. దీనిపై న్యాయవ్యవస్థ సీబీఐ విచారణకు ఆదేశించింది.
• రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్‌ను, డిప్యూటేషన్‌లో కొనసాగుతున్న కేంద్ర అధికారులను జగన్ ప్రభుత్వం తీవ్రంగా వేటాడుతోంది. దీంతో కోర్టులు పలు సందర్భాల్లో బాధిత అధికారులకు అండగా నిలిచాయి. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ (SEC) తన భద్రత కోసం భారత ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
• ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరక్షరాస్యులను సైతం పట్టభద్రులుగా నమోదు చేసుకున్న తీరు ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి ఏ స్థాయిలో వక్రీకరిస్తారనడానికి ఉదాహరణ.
• ఓటర్ల నమోదులో నిమగ్నమైన ఉద్యోగులను ముఖ్యమంత్రి జగన్ భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తున్నాడు. ఈ తప్పుడు పనులు చేయడానికి 'వాలంటీర్లను' సైతం వాడుకుంటున్నారు. వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి వ్యక్తిగత డేటాను సేకరించారు. ఎన్నికల సమయంలో బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ కోసం ఈ డేటాను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
• హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి విషయంలోనూ జగన్ సర్కారు వింత పోకడకు తెరతీసింది. టీటీడీ బోర్డు చైర్మన్ గా హిందూయేతర వ్యక్తిని ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు నియమించారు.
• వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు రాష్ట్రంలోని 250 కుపైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. వక్ఫ్ బోర్డు ఆస్తులు, చర్చి ఆస్తులు అన్యాక్రాంతం కావడం సర్వసాధారణంగా మారింది.
• జగన్ పాలనలో ప్రజల జీవితాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్ జరిగినా రెండు రోజుల తర్వాత కానీ బయటపడలేదు. బాపట్ల జిల్లాలో 14 ఏళ్ల పాఠశాల బాలుడు యు.అమర్‌నాథ్ తన సోదరిని గూండాలు లైంగికంగా వేధించడాన్ని ప్రశ్నించినందుకు సంఘ వ్యతిరేక వ్యక్తులు పట్టపగలు ఆ విద్యార్థిని సజీవ దహనం చేశారు.
• వైసీపీ శాసన మండలి సభ్యుడు అనంత్ బాబు తన కారు డ్రైవర్‌ను హత్య చేసి, డ్రైవర్ మృతదేహాన్ని వారి ఇంటి గుమ్మం వద్ద పడేసి వెళ్లాడు. రాష్ట్రంలో ‘లా అండ్ ఆర్డర్’ అనేది ఎక్కడా కనిపించడం లేదు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాల వారు రాష్ట్ర ప్రభుత్వ క్రూరత్వానికి బలి అవుతున్నారు.
• నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో సీనియర్ ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ను వేటాడి, చిత్రహింసలు పెట్టి, వేధింపులకు గురిచేయడం చివరకు అతని మరణానికి దారితీసింది. కోవిడ్ సమయంలో పీపీఈ కిట్ లను అడగడమే డాక్టర్ సుధాకర్ నేరం అయ్యింది. పోలీసులు సుధాకర్ ను అరెస్టు చేసి మానసిక రోగి అంటూ ముద్రవేసి ఆసుపత్రిలో చేర్చారు. అధికారుల వేధింపులు చివరకు డాక్టర్ సుధాకర్ అకాల మరణానికి దారితీశాయి.
• జగన్ ను వ్యతిరేకించిన వారు హింసకు గురవుతున్నారు. సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. ఈ హింసను ముఖ్యమంత్రి వీడియో కాల్ ద్వారా లైవ్ చూశారని కూడా తెలుస్తోంది. న్యాయస్థానం జోక్యం చేసుకున్నాకే ఎంపీకి ఉపశమనం లభించింది.
• టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకోక ముందే అక్రమ అరెస్టుతో, పోలీసు వాహనంలో వందల కిలోమీటర్లు తరలించారు. దీంతో ఆయనకు విపరీతమైన రక్తస్రావం జరిగింది.
• సినిమారంగం ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ప్రస్తావించిన పద్మభూషణ్ చిరంజీవి, హైదరాబాద్ అభివృద్దికి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పిన రజనీకాంత్ లపై వైసీపీ మాటల దాడిచేసింది. వారి క్యారెక్టర్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ జరిగింది. తమను ప్రశ్నించిన వారిపై సామాజిక మాధ్యమాల ద్వారా, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది.
• 2020లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం ప్రతిస్పందన గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు అడిగిన 60 ఏళ్ల రంగనాయకిపై ఐపీసీ, ఐటీ IPC, IT చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపి అరెస్టు చేశారు. 
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు మాదకద్రవ్యాలకు అతిపెద్ద కేంద్రంగా అవతరించింది. ఇది రాష్ట్రంలో నేరాలను పెంచుతోంది. గంజాయి గ్యాంగ్‌లు, బ్లేడ్ గ్యాంగ్‌లు పెరిగిపోతున్నాయి. ఈ అంశాన్ని ఎత్తిచూపడంతో డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలోనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేశారు. అయినా ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
• డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) విడుదల చేసిన ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా’ 2021-22 నివేదికలో డ్రగ్స్‌ స్మగ్లింగ్ దేశంలోకెల్లా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువని స్పష్టంగా పేర్కొంది. ఒక్క ఏపీలోనే 18,267 కేజీల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని వివరించింది. 
• రాష్ట్ర ప్రభుత్వం అమర్ రాజా, లులు గ్రూప్, కియా మోటార్స్ వంటి వ్యాపార సంస్థలను వేధించింది. 
• మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చిలో పులివెందులలోని తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. సాక్షి టీవీ ఆ హత్యను గుండెపోటుగా కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. కుదరకపోవడంతో ఈ హత్యను జగన్ తన రాజకీయ ప్రత్యర్థులపై నెట్టివేసే ప్రయత్నం చేశారు.
• ఈ కేసులో జగన్ బంధువు, ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి నిందితులని సీబీఐ నిర్ధారించింది. 
• “15-03-2019 తెల్లవారుజామున వైఎస్ వివేకానంద రెడ్డి మరణం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి సమాచారం అందించినట్లు తదుపరి దర్యాప్తులో వెల్లడైంది. వైఎస్ వివేకా మరణవార్త గురించి ఎంవి కృష్ణారెడ్డి ఉదయం 6:15 గంటల సమయంలో సమాచారం ఇవ్వకముందే.. అవినాశ్ రెడ్డి ద్వారా సీఎంకు తెలిసింది. ఈ కారణంగా హత్యలో జగన్ పాత్రను దర్యాప్తు చేయవలసి ఉంది.
• ఈ కేసు విచారణలో సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పించింది. విచారణకు అడ్డుతుగులుతున్న వారిపై చర్యలు తీసుకోవద్దంటూ జగన్ రాష్ట్ర పోలీసు బలగాలను ఆదేశించారు. దీంతో ఆసుపత్రిలో దాక్కున్న అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయకుండా సీబీఐని వైసీపీ గుంపు అడ్డుకుంది.
• విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్‌ పై జరిగిన కత్తి దాడిలో ఎలాంటి కుట్రలేదని ఎన్‌ఐఏ తేల్చింది. దీంతో ఎన్ఐఏ దర్యాఫ్తును తప్పుబడుతూ వైసీపీ నేతలు దాడి చేశారు. 
• ప్రతిపక్ష నాయకుడైన నాపై పలుమార్లు భౌతిక దాడి, నేరపూరిత కుట్ర జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే, నా భద్రతను తగ్గించారు. హైకోర్టు సూచనలతో కొంత భద్రత  కొనసాగించారు. డీఎస్పీ ర్యాంక్‌లోని ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు నా భద్రతకు ఉండవలసి ఉంది. అయితే ప్రభుత్వం ఒక్క డీఎస్పీ స్థాయి వారినే కేటాయించింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నా నివాసంపై 2019 ఆగస్టులో డ్రోన్‌లు ఎగరవేశారు. వారిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించినా నేటికీ ఎలాంటి చర్యలు లేవు.
• 2021 సెప్టెంబర్ లో వైసీపీ ఎమ్మెల్యే , ప్రస్తుత మంత్రి  జోగి రమేష్ తన అనుచరులతో కలిసి కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్‌లతో నా నివాసంపై దాడి చేశారు. వారిపైనా ఇప్పటికీ చర్యలు లేవు. నేను రాష్ట్రంలో పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ, ప్రజల్లోనూ నాపై దాడి చేశారు. పోలీసుల పర్యవేక్షణలోనే వైసీపీ గుంపు నాపై రాళ్లు రువ్వుతుంది. మా పార్టీ సమావేశాలకు హాజరయ్యే వ్యక్తులపై కర్రలు, రాడ్లతో దాడి చేస్తుంది. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారంలో నాపై రాళ్లు రువ్వారు. గతంలో నందిగామ, యర్రగొండపాలెంలో కూడా నాపై ఇలాంటి దాడులు జరిగాయి.
• ఫిబ్రవరి 2023లో, అనపర్తిలో టూర్ షెడ్యూల్‌ను చాలా ముందుగానే ఇచ్చినప్పటికీ ఆంక్షల పేరుతో పోలీసులు నన్ను చీకట్లో 7 కిలోమీటర్లు నడిచి వెళ్లేలా చేశారు. ప్రతిపక్ష పార్టీలు బహిరంగ సభలు నిర్వహించకుండా ఉండేందుకు ప్రభుత్వం జీఓ నెం.1ని తీసుకొచ్చింది. హైకోర్టు దానిని కొట్టివేసింది.
• జగన్ పాలనలో సామాన్య ప్రజలతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం దాడులకు గురవుతున్నారు.
• నందిగామ దాడి సమయంలో నా సీఎస్ వో గాయపడ్డారు, యర్రగొండపాలెం వద్ద జరిగిన దాడిలో ఎన్ఎస్ జీ టీమ్ కమాండర్ గాయపడ్డారు.
• రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను నిలిపివేసి, జగన్ నిర్లక్ష్యం చేశారు.
• రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై స్థితిగతులను ప్రజలకు వివరించడానికి 10 రోజులపాటు రాష్ట్రంలో 2500 కి.మీ. నేను పర్యటించాను. పోలవరం ప్రాజెక్టు కోసం నేను చేసిన కృషి ని జగన్ నాశనం చేశారు.ప్రాజెక్టు సందర్శించినప్పుడు ప్రాజెక్ట్ సైట్ రాజధాని అమరావతిలోని నేటి శిథిలాల మాదిరిగానే కనిపించింది.
ప్రాజెక్ట్ లో ఈ పరిస్థితికి సీఎం జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడమే కారణం అనిపిస్తుంది.
• రాయలసీమ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాజెక్టుల కాంట్రాక్టులలో ఎక్కువ భాగం మంత్రి, కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ మార్గాల ద్వారా దక్కించుకున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పేరుతో పూర్తిగా అనవసరమైన ప్రాజెక్ట్‌ను రూపొందించి మంత్రికి పనులు అప్పగించారు.
• ఆవులపల్లి ప్రాజెక్ట్‌లో హరిత నిబంధనలు ఉల్లంఘించినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది, అందులో ప్రభుత్వం రూ.25 కోట్లను ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించింది. ఈ ప్రాజెక్టులలో మంత్రి దాదాపు రూ.8వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు.
• నా పర్యటన ద్వారా వారి అవినీతి పనులు బయటికి రావడంతో 2023 ఆగస్టు 4న అంగళ్లులోని మూడు రోడ్ల కూడలిలో నాపై దాడికి చేసి చంపేందుకు ప్రయత్నించారు. ఎన్ఎస్ జీ కమాండోల కారణంగా క్షేమంగా బయటపడ్డాను. వైసీపీ గూండాల నుండి నన్ను రక్షించడానికి వారి బుల్లెట్ రెసిస్టెంట్ షీట్‌లు అడ్డుగా పెట్టారు. అధికార పార్టీ గూండాలు ప్రతిపక్ష నాయకుడిపై రాళ్లదాడి చేసిన దృశ్యాలు రాష్ట్రమంతా టీవీలో ప్రత్యక్షంగా చూశారు.
• నాటి నా పర్యటన షెడ్యూల్‌ను సంబంధిత జిల్లా పోలీసు అధికారులతో చాలా ముందుగానే పంచుకున్నాను. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ  స్థానిక పోలీసులు మద్యం సీసాలు, రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్‌లతో ఉన్న వైసీపీ గూండాలను కట్టడి చేయలేదు. పుంగనూరు పట్టణంలోకి నన్ను అనుమతించబోమని వైసీపీ గూండాలు బహిరంగంగా ప్రకటించారు.
• నేను అంగళ్లు గ్రామం చేరుకోవడానికి మూడు గంటల ముందు, సీఎస్ వో, ఎన్ఎస్ జీ కమాండింగ్ ఆఫీసర్ నా కాన్వాయ్‌ పై దాడికి ఆస్కారం ఉన్నట్లు స్థానిక డీఎస్పీ, ఎస్పీలకు సమాచారం అందించారు. అయినా స్థానిక పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోలేదు. దీనికి తోడుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక పోలీసు అధికారులలో ఒక వర్గం నేరపూరిత కుట్రలో భాగస్వాములుగా ఉన్నారు.
• కాంట్రాక్టర్-కమ్-మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాకు చెందిన కళంకిత ఐపీఎస్ అధికారి సేవలను ఉపయోగించుకున్నారు. జగన్, అతని గూండాలు, మంత్రులు చేస్తున్న నేరాలలో పోలీసులను భాగస్వాములుగా మారుస్తున్నారు.
• ప్రతిపక్ష నేతతో సహా ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్‌కు ముఖ్యమంత్రిపై బాధ్యత ఉంది. నాకు రక్షణ కల్పించడానికి బదులుగా, అతను నాపై దాడికి పాల్పడ్డాడు. పైగా నాపైనే హత్యాయత్నం ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 10.08.2023న ఒక బహిరంగ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలతో ఉద్దేశ్యపూర్వకంగానే నా భద్రత తగ్గించినట్లు అర్థంమవుతోంది.
• ఈ అసాధారణ పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం మీ అత్యున్నత అధికారాన్ని ఉపయోగించమని కోరుతున్నాను. నాపై పదే పదే జరుగుతున్న ప్రాణాంతక దాడులు, అటువంటి దాడుల వెనుక నేరపూరిత కుట్రను వెలికితీయడానికి సీబీఐ చేత విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అంగళ్లు, పుంగనూరు బైపాస్ వద్ద ఇటీవల నాపై జరిగిన దాడుల నేపథ్యంలో నాకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడేందుకు మీరు చొరవ చూపాలని కోరుతున్నాను.

More Telugu News