Narendra Modi: ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ రక్తంతో ఆడుకుందంటూ మోదీ తీవ్ర విమర్శలు

  • పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై విరుచుకుపడిన ప్రధాని
  • ఇటీవల జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల్లో హింసకు పాల్పడిందని విమర్శ
  • గూండాలకు కాంట్రాక్టు ఇచ్చి పోలింగ్‌ బూత్‌లను స్వాధీనం చేసుకుందని ఆరోపణ
PM Modi attack on Trinamool over Bengal poll violence says TMC Played with blood

పశ్చిమ బెంగాల్‌ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆ పార్టీ రక్తంతో ఆడుకుందని విమర్శించారు. బెంగాల్‌లోని క్షేత్రీయ పంచాయతీ రాజ్ పరిషత్‌ సమావేశంలో వర్చువల్‌గా మాట్లాడిన ప్రధాని అధికార టీఎంసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఓటర్లను బెదిరిస్తోందని, వారి జీవితాలను నరకం చేస్తోందని ఆరోపించారు. 

ప్రజాస్వామ్యానికి తమను తాము చాంపియన్లుగా అభివర్ణించుకునే వారే ఈవీఎంలను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని మోదీ అన్నారు. ‘టీఎంసీ పార్టీ గూండాలకు కాంట్రాక్టు ఇచ్చి ఓట్ల లెక్కింపు రోజున బూత్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అంతటితో ఆగకుండా తమ పని పూర్తి చేయడానికి ప్రాణాంతక దాడులకు పాల్పడింది’ అని ప్రధాని పేర్కొన్నారు. 

జులై 8న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర హింసాకాండ జరిగింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించింది. దాదాపు 80 శాతం గ్రామ పంచాయతీలు, 92 శాతం పంచాయతీ సమితులు గెలుచుకోవడంతో పాటు రాష్ట్రంలోని 20 జిల్లా పరిషత్‌లను పార్టీ గెలుచుకుంది. బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికలకు సమయంలో జరిగిన హింసలో మొత్తం 40 మంది మరణించినట్టు వార్తలు వచ్చాయి.

More Telugu News