West Godavari District: చెప్పుతో కొట్టుకున్న సర్పంచ్.. సీఎం జగన్‌కు మద్దతిచ్చి తప్పు చేశానని ఆవేదన

  • పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన, బీజేపీల నిరసన కార్యక్రమం
  • కార్యక్రమంలో పాలుపంచుకున్న అరుగొలను గ్రామ సర్పంచ్
  • జగన్‌ను సీఎం చేసేందుకు కృషి చేయడం తన పొరపాటని ఆవేదన
  • తన తప్పును దేవుడు కూడా క్షమించడంటూ చెప్పుతో కొట్టుకుని నిరసన
Arugolanu sarpanch slaps himself with slippers as mark of protest of against AP CM jagan

గ్రామపంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని అరుగొలనుకు చెందిన ఓ సర్పంచ్ పీతల బుచ్చిబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను గెలిపించినందుకు పశ్చాత్తాపపడుతూ తనని తాను చెప్పుతో కొట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపిస్తూ  జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో గురువారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లి గూడెం మండల సర్పంచ్‌ల ఛాంబర్ అధ్యక్షుడు, అరుగొలను సర్పంచ్ పీతల బుచ్చిబాబు కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సర్పంచ్ బుచ్చిబాబు సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఏపీని బాగు చేస్తారనే ఉద్దేశంతో జగన్‌ను సీఎం చేసేందుకు 10 సంవత్సరాల పాటు భార్యాపిల్లలను, వ్యాపారాలను వదులుకుని కష్టపడ్డానని చెప్పారు. అప్పట్లో జైలు పాలైన జగన్‌కు బెయిలు రావాలంటూ మేరీ మాతను వేడుకుని మొక్కులు తీర్చుకున్నానని చెప్పారు. గ్రామాల్లో తాను చేపట్టిన కార్యక్రమాలన్నీ జగన్ పేరునే చేశానని తెలిపారు. ఇలాంటి తప్పు చేసినందుకు తనని తానే చెప్పుతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు. గత ఎన్నికల్లో తనకు పార్టీలో సముచిత స్థానం దక్కకపోవడంతో జనసేన, టీడీపీ, బీజేపీ మద్దతుతో ఎన్నికల్లో గట్టెక్కినట్టు తెలిపారు. ‘‘నేను చేసిన తప్పును దేవుడు కూడా క్షమించడు. చాలా పెద్ద తప్పు చేశాను, ప్రజలు నన్ను క్షమించాలని కోరుతున్నా’’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News