Bandi Sanjay: బెంగాల్ దీదీ, ఢిల్లీ కేజ్రీ, ఇక్కడి కాంగీ, తెలంగాణ కేడీ అవిశ్వాసం ఎందుకు పెట్టారు?: లోక్ సభలో ఊగిపోయిన బండి సంజయ్

  • అవినీతి చేసిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌లా మారిందన్న కరీంనగర్ ఎంపీ 
  • కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు నాశనమయ్యారని ఆవేదన
  • కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు మాత్రం పెరిగాయని ఆరోపణ
  • బీఆర్ఎస్ అధినేత పేరు ఖాసిం చంద్రశేఖర్ రజ్వీ అంటూ విమర్శలు 
  • ఆరెస్సెస్‌ను అంటే కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవని హెచ్చరిక
Bandi Sanjay lashes out at KCR in Lok Sabha

యూపీఏలా తెలంగాణలో అవినీతి చేసిన టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్‌గా మారిందని, బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన ఆవేశంగా, ఉద్వేగంగా మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత పేరు ఖాసిం చంద్రశేఖర్ రజ్వీ అంటూ విమర్శలు గుప్పించారు. బెంగాల్ దీదీ, ఢిల్లీ కేజ్రీ, ఇక్కడి కాంగీ, తెలంగాణ కేడీ అవిశ్వాసం ఎందుకు పెట్టారని నిలదీశారు. తెలంగాణలో 1400 మందిని బలి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మీరు తెలంగాణ ఇవ్వకుంటే మేం అధికారంలోకి వచ్చాక ఇస్తామని నాడు సుష్మాస్వరాజ్ చెబితే, ఆ తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. మోదీ హయాంలో శక్తిమంతమైన భారత నిర్మాణం జరుగుతోందన్నారు. రాహుల్ గాంధీని చూస్తే గజినీ గుర్తుకు వస్తున్నారన్నారు.

కేసీఆర్ తన పాలనలో తెలంగాణ ప్రజలను, రైతులను నాశనం చేశారన్నారు. బీఆర్ఎస్‌కు తెలిసింది ఏమంటే రాత్రంతా తాగడం, ఉదయం పడుకోవడం, ఎవరినీ కలవకపోవడమని ఎద్దేవా చేశారు. ఈ తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్, ఆయన కుటుంబ ఆస్తులు భారీగా పెరిగాయన్నారు. కానీ ప్రజలు మాత్రం అప్పుల్లో కూరుకుపోయారన్నారు. కేసీఆర్ వ్యవసాయం ద్వారా ఎకరాకు రూ.1 కోటి సంపాదిస్తున్నారని, కేసీఆర్ కొడుకు ఆస్తులు 400 రెట్లు పెరిగాయని నిప్పులు చెరిగారు. కేసీఆర్ అవిశ్వాసానికి ఎందుకు మద్దతిచ్చారో చెప్పాలన్నారు.

తెలంగాణలో కేసీఆర్ పాలనలో ప్రజల్ని మోసం చేశారన్నారు. అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. మిషన్ భగీరథ పేరుతో, కేంద్రం ఇచ్చిన డబ్బులను ప్రజలకు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. బీఆర్ఎస్ దొంగలు బియ్యాన్ని కూడా అమ్ముకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటోందన్నారు. మోదీ మణిపూర్ పోలేదంటున్నారని, కానీ రైతులు, యువత, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి లేదన్నారు. గత పలు ఎన్నికల్లో చాలాచోట్ల కనీసం డిపాజిట్ రాలేదన్నారు.

కాంగ్రెస్ మాట్లాడితే నిక్కర్ పార్టీ అంటోందని, కానీ ఈ దేశంలో సనాతన ధర్మాన్ని, హిందువులను సంఘటితం చేసే, దేశభక్తిని నేర్పే సంస్థ ఆరెస్సెస్ అన్నారు. ఉదయం లేస్తారు.. నిక్కర్ వేస్తారని అవమానించవద్దని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా నమస్తే సదావత్సలే మాతృభూమి.. త్వయా హిందు భూమే సుఖం వర్దీతో హమ్.. అంటూ వినిపించారు. ఆరెస్సెస్‌ను అవమానిస్తే కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.

ఈ వేదిక నుండి తాను తెలంగాణ ప్రజలకు ఒకటే చెబుతున్నానని, కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. ఈ మూడు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే అన్నారు. తాను తెలంగాణ సమాజాన్ని కోరుతున్నానని. మీకు మోదీ ప్రభుత్వం అండగా ఉందని, డబుల్ ఇంజిన్ సర్కార్‌కు మద్దతివ్వాలన్నారు.

  • Loading...

More Telugu News