PM Modi: కాంగ్రెస్ పార్టీ తీరువల్లే శరద్ పవార్ ప్రధాని కాలేకపోయారు: ప్రధాని మోదీ

  • ఇకపైనా పవార్ ప్రధాని అయ్యే అవకాశం లేదన్న మోదీ
  • ఎన్డీయే కూటమి ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని వ్యాఖ్యలు
  • ప్రతిపక్షాలలో ప్రతిభావంతులను కాంగ్రెస్ అణచివేస్తోందని ఆరోపణ
Prime Minister Modi sensational comments on Sharad pawar

కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల వల్ల ప్రతిపక్షాలలోని ప్రతిభావంతులైన నేతలు కూడా తగిన స్థానం పొందడంలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ప్రధాని కాకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ఈమేరకు మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఎన్డీయే కూటమి ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ కు తన స్వార్థ రాజకీయాలే తప్ప ఇతరులు, దేశ ప్రయోజనాలపై పట్టింపులేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ రాజకీయాలతో ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వంటి నేతలు ప్రధాని పీఠంపై కూర్చోలేకపోయారని మోదీ విమర్శించారు. ఇకపైనా పవార్ ప్రధాని అయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పారు. వారంతా సమర్థులేనని, ప్రధాని పదవికి అర్హులేనన్న విషయం అందరికీ తెలుసని చెప్పారు. ఎన్డీయే కూటమిలో మాత్రం అలాంటి స్వార్థ రాజకీయాలకు చోటులేదని మోదీ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. కూటమిలో మిత్రపక్షాలు, వారి ప్రయోజనాలు కూడా తమకు ముఖ్యమేనని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని మోదీ వివరించారు.

More Telugu News