Ganta Srinivasa Rao: చిరంజీవి చెప్పిన దానిలో తప్పేముంది... నిజాలే మాట్లాడారు: గంటా శ్రీనివాసరావు

  • చిరంజీవి వంటి వారికే ఇబ్బంది కలిగి అలా మాట్లాడారంటే అర్థం చేసుకోవాలన్న గంటా
  • శాఖల గురించి 10 నిమిషాలు మాట్లాడలేని మంత్రులు మీడియా ముందుకొచ్చారని ఆగ్రహం
  • బ్రహ్మాండం బద్ధలైనట్లు చిరంజీవి గురించి ఏదేదో మాట్లాడుతున్నారన్న గంటా
There is no wrong in Chiranjeevi comments says Ganta

సాధారణంగా విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి వంటి వారికి కూడా ఇబ్బంది కలిగి అలా మాట్లాడారంటే రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చునని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంటా... చిరంజీవిని సమర్థిస్తూ ట్వీట్ చేశారు. 

విమర్శలకు , వివాదాలకు దూరంగా ఉండే అందరివాడు మెగాస్టార్ చిరంజీవి అని, అయినా చిరంజీవి చెప్పినదాంట్లో తప్పేముందని, నిజాలే మాట్లాడారన్నారు. ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు... అంతే కదా అన్నారు.

మీరు ప్రత్యేక హోదా గురించి... రోడ్ల నిర్మాణం గురించి... ప్రాజెక్టుల గురించి.... పేదవాడి కడుపు నింపే ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి.. అలా కాదని పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీ మీద పడతారేంటి... ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారని, ఆయన చెప్పిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా పట్టుమని పది నిమిషాలు తమ శాఖల గురించి మాట్లాడలేని మంత్రులు అందరూ మీడియా ముందుకు వచ్చి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు ఏదేదో ఆయన గురించి మాట్లాడటం సరికాదన్నారు.

ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై కాకుండా ఉద్యోగాలు, పేదలపై దృష్టి సారించాలన్న మెగాస్టార్ చిరంజీవి గారి వ్యాఖ్యలను తెలుగు ప్రజలందరూ సమర్థిస్తున్నారని గంటా పేర్కొన్నారు.

More Telugu News