Gudivada Amarnath: చిరంజీవి ఏది పడితే అది మాట్లాడితే ఎలా... మొదట పవన్‌కు జ్ఞానబోధ చేయాలి: మంత్రి అమర్నాథ్

  • సినిమాలను మొదట రాజకీయాల్లోకి ఎవరు లాగారో చెప్పాలన్న మంత్రి
  • బ్రో సినిమాలో అంబటి పాత్రను పెట్టామని చెప్పే ధైర్యం కూడా లేదని వ్యాఖ్య
  • సినిమాలను పిచ్చుక అంటూ పరిశ్రమను తక్కువ చేస్తే ఎలా?
Minister Amarnath Reddy on Chiranjeevi comments

మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. చిరంజీవి మొదట తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు జ్ఞానబోధ చేయాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని, అయితే ఆయన సినిమాలను రాజకీయాల్లోకి లాగవద్దని మాట్లాడినట్లుగా తెలిసిందని, కానీ అలా మొదట చేసింది ఎవరో తెలుసుకోవాలన్నారు. సినిమాలను రాజకీయాల్లోకి తెచ్చింది జనసేన అధినేత అన్నారు. మళ్లీ దాడికి ప్రతిదాడి చేస్తే బాధపడుతున్నారన్నారు.

బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు పాత్రను సృష్టించింది ఎవరు? అని అడిగారు. ఆ పాత్ర అంబటిదేనని చెప్పే ధైర్యం కూడా వారికి లేదన్నారు. అసలు బ్రో సినిమాలో క్యారెక్టర్ పెట్టారో లేదో చెప్పగలరా? అన్నారు. తొలుత తమ్ముడికి జ్ఞానబోధ చేసి, ఆ తర్వాత రాజకీయ నాయకులకు సూచనలు చేయవచ్చునని చిరంజీవికి సూచించారు. ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు. సినిమాలను పిచ్చుక అని అంటూ పరిశ్రమను తక్కువ చేస్తే ఎలా? అన్నారు.

అంతకుముందు అంబటి రాంబాబు మాట్లాడుతూ... తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలని చిరంజీవికి సూచించారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారా? లేదా? చెప్పాలన్నారు. చిరంజీవి ఏం మాట్లాడారో చూసి రేపు మాట్లాడుతానన్నారు. చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందన్నారు.

More Telugu News