Perni Nani: లోకేశ్ బలుపుకు నిదర్శనం... చంద్రబాబే తొలి ముద్దాయి: పేర్ని నాని

  • అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడన్న నాని
  • పక్క జిల్లాల నుండి రౌడీ మూకలను రప్పించి, పోలీసులపై దాడి చేసి అల్లర్లకు కుట్ర
  • ముందు రోజే రాళ్లు, కర్రలు తెచ్చి పెట్టుకున్నారని ఆరోపణ
  • ఎస్పీ రిషాంత్ కళ్లకు ఆపరేషన్ చేయిస్తామన్న లోకేశ్‌పై ఆగ్రహం
  • పోలీసులు లేకుంటే లోకేశ్ గడప దాటగలరా? అని ప్రశ్న
  • 1995 నుండి చంద్రబాబు ఏం చేశారని నిలదీత
Perni Nani says Chandrababu is first accused in Punganur issue

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పుంగనూరులో చంద్రబాబు రౌడీయిజానికి పాల్పడ్డాడని ఆరోపించారు. పక్క జిల్లాల నుండి రౌడీ మూకలను తీసుకు వచ్చి మోహరించారని, పోలీసులపై దాడి చేసి అల్లర్లకు కుట్రపన్నారన్నారు. పక్కా స్కెచ్‌తో రెక్కీ చేయించాడని, ముందురోజే రాళ్లు, కర్రలు తెచ్చి పెట్టుకున్నారన్నారు.

ఎస్పీ రిషాంత్ రెడ్డి కళ్లకు ఆపరేషన్ చేయిస్తామనడం లోకేశ్ బలుపుకు నిదర్శనమన్నారు. పోలీసులకు కులం ఉంటుందా? అని నిలదీశారు. పోలీసుల సంగతి చూస్తానని లోకేశ్ అంటున్నాడని, అసలు వారు లేకుంటే గడపదాటి బయట అడుగు పెడతాడా? అని ధ్వజమెత్తారు. పుంగనూరు మారణకాండలో చంద్రబాబును మొదటి ముద్దాయిగా పరిగణించాలన్నారు. టీడీపీ కార్యకర్తలు పదిమంది చనిపోవడమే చంద్రబాబు ఉద్దేశ్యమన్నారు. ముసలి తండ్రి, నడివయస్సు కొడుకు కలిసి 2019 వరకు అధికారంలో ఉండి ఏం పొడిచారన్నారు.

టీడీపీకి మరోసారి వాత పెట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 1995 నుండి రాయలసీమకు నీళ్లివ్వకుండా చంద్రబాబు ఏం చేశారు? అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు పూర్తి చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. 35 ఏళ్లుగా గెలుస్తోన్న తమ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగా మొగాడే అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం ఏది? అంటే ఏం చెబుతారని ప్రశ్నించారు. చంద్రగిరిలో గెలిచారా? కుప్పంలో ఎందుకున్నారని నిలదీశారు.

More Telugu News