మద్యం మత్తులో కారు నడిపి ముగ్గురి ప్రాణాలు తీసిన యువకులు

3 Dead In Road Accident in Vizag Beach Road
విశాఖపట్టణం-భీమిలి మార్గంలో గతరాత్రి మద్యంమత్తులో కారు నడిపిన కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. పోలీసుల కథనం ప్రకారం..  సాగర్ నగర్ నుంచి ఎండాడ వైపు వెళ్తున్న కారు రాడిసన్ హోటల్ మలుపు వద్ద అదుపు తప్పింది. తొలుత డివైడర్‌ను ఆ తర్వాత చెట్టును ఢీకొట్టి అవతలివైపునకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైక్‌పై ఉన్న పృథ్వీరాజ్ (28), ప్రియాంక (21) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిది ఒడిశాలోని రాయగడగా గుర్తించారు. పృథ్వీరాజ్ ఓ సంస్థలో సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు, ప్రమాదానికి గురైన కారులో వెనక సీట్లో కూర్చున్న ఎం.మణికుమార్ (25) తీవ్రంగా గాయపడి కారులోనే మృతి చెందాడు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. కారులోని ముగ్గురు యువకులు పరారయ్యారు. గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

రోడ్డుపై మద్యం సీసాలు పగలగొట్టి హల్‌చల్
ప్రమాదానికి గురైన కారులోని యువకులు అంతకుముందు సాగర్‌నగర్ ఆర్చ్ వద్ద యువకులతో వాగ్వివాదానికి దిగారు. రోడ్డుపై మద్యం సీసాలు పగలగొట్టి నానా హంగామా చేశారు. అంతేకాదు, యువకుల సెల్‌ఫోన్ లాక్కుని వెళ్లిపోయారు. ప్రమాదానికి గురైన కారులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Visakhapatnam
Road Accident
Beach Road
Bheemili

More Telugu News