TTD: ప్రసాదాల తయారీ నెయ్యి ప్లాంట్ కోసం రూ.5 కోట్లు: టీటీడీ కీలక నిర్ణయాలు

  • పాలకమండలి నిర్ణయాలను వెల్లడించిన వైవీ సుబ్బారెడ్డి
  • భక్తుల సౌకర్యం కోసం రూ.4 కోట్లతో షెడ్ల ఏర్పాటు
  • పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.23.5 కోట్లు
TTD key decisions in Palaka Mandali meeting

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం నుండి మోకాలిమిట్ట వరకు భక్తుల సౌకర్యార్థం షెడ్ల ఏర్పాటుకు రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రూ.24 కోట్లతో రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బారియర్లు ఏర్పాటు చేస్తారు.

రూ.2.5 కోట్లతో పీఏసీలో భక్తుల కోసం మరమ్మతు పనులు, రూ.4.5 కోట్లతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికీకరణ, రూ.23.50 కోట్లతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, రూ.3 కోట్లతో శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణం, రూ.3.10 కోట్లతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ధి పనులు, రూ.9.85 కోట్లతో వకుళామాత ఆలయం వద్ద అభివృద్ధి పనులు, రూ.2.6 కోట్లతో తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు రూ.118 కోట్ల కేటాయింపు, ఎస్వీ ఆయుర్వేద కళాశాల అభివృద్ధి పనులకు రూ.11.5 కోట్ల కేటాయింపు, రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు రూ.2.20 కోట్ల కేటాయింపు, ఎస్వీ సంగీత కళాశాల అభివృద్ధి పనులకు రూ.11 కోట్లు, తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం, పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.25 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అలాగే, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ని టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడేళ్లు పొడిగించారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా 69 స్థలాలకు కంచె ఏర్పాటుకు రూ.1.25 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. ప్రసాదాల తయారీ కోసం వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయించారు.

More Telugu News