Lok Sabha: ‘డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు 2023కు లోక్‌సభ ఆమోదం

  • పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మరో కీలక బిల్లుకు ఆమోదం
  • పౌరుల డిజిటల్ హక్కులు బలోపేతం అవుతాయంటున్న కేంద్రం
  • వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం చేసే కంపెనీలపై చర్యలకు వీలుంటుందని వెల్లడి
  • లోక్ సభలో మూజువాణి పద్ధతిలో ఓటింగ్.. ఆమోదం 
Lok Sabha approved Digital Personal Data Protection Bill

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మరో కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేశ పౌరుల డేటా దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కఠిన చర్యలకు వీలు కల్పించే ఈ బిల్లుకు లోక్ సభలో మెజారిటీ సభ్యుల మద్దతు లభించింది. 

ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2023 ద్వారా దేశ పౌరుల డిజిటల్ హక్కులు బలోపేతం అవుతాయని కేంద్రం చెబుతోంది. ముఖ్యంగా, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం చేసే కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు వీలవుతుందన్నది ప్రభుత్వ వాదన. 

ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం గతవారమే లోక్ సభలో ప్రవేశపెట్టింది. దీనిపై నేడు చర్చ చేపట్టారు. అయితే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఓవైపు విపక్షాల నిరసనలు కొనసాగుతుండగానే మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించి బిల్లును కేంద్రం ఆమోదింపజేసుకుంది. 

గత గురువారం నాడు ఈ బిల్లును కేంద్ర కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే, వ్యక్తిగత సమాచార గోప్యత ప్రాథమిక హక్కుకు ఈ బిల్లు తూట్లు పొడుస్తుందని విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ బిల్లును మొదట స్టాండింగ్ కమిటీ ముందుకు పంపాలని డిమాండ్ చేశాయి. గతేడాది కూడా ఇలాంటిదే బిల్లు తీసుకువచ్చే ప్రయత్నం చేసి, ప్రభుత్వం ఉపసంహరించుకుందని విపక్షాలు గుర్తు చేశాయి. కానీ, ఈసారి మాత్రం కేంద్రం పట్టుబట్టి మరీ బిల్లును ఆమోదింపజేసుకుంది.

More Telugu News