Drinking: నీరు తక్కువ తాగితే ప్రమాదమా? ఎక్కువ తాగితే ప్రాణాంతకమా?

  • నీరు బాగా తగ్గినా, గణనీయంగా పెరిగినా ప్రమాదమే
  • శరీర నీటి పరిమాణంలో సమతూకం అవసరం
  • ఎన్నో ముఖ్యమైన జీవక్రియలకు నీరు కావాలి
Drinking too little or too much water which is deadlier

నీరు తగినంత తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. మన శరీరాన్ని శుభ్రం చేయడంలో నీటి పాత్ర ఎంతో ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతూ, కణాలను జీవించి ఉంచేలా నీరు చేస్తుంది. అందుకే నీరు ప్రాణాధారం. ఆహారం లేకుండా కొన్ని రోజులు జీవించొచ్చేమో కానీ, నీరు లేకుండా 100 గంటలకు మించి జీవించి ఉండడం కష్టం. 

అయితే, నీరు ఎక్కువైనా, తక్కువైనా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిల్లో ఏ చర్య ఎక్కువ ప్రమాదకరం? ఇటీవలే ఇండియానాకు చెందిన 35 ఏళ్ల మహిళ అధిక పరిమాణంలో నీటిని తాగడం వల్ల మరణించడంతో దీనిపై చర్చ నడుస్తోంది. వాటర్ ఇన్ టాక్సికేషన్ వల్ల ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. స్వల్ప సమయంలోనే అతిగా నీరు తాగడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఒకవైపు డీహైడ్రేషన్ (నీటి పరిమాణం తగ్గడం) అయినా, ఓవర్ హైడ్రేషన్ (అధిక నీరుతో) అయినా శరీరంలో ద్రవ పరమైన బ్యాలన్స్ తప్పడం వల్ల వచ్చేవే. ఈ రెండింటినీ సకాలంలో చికిత్స ద్వారా పరిష్కరించకపోతే ప్రాణాంతకానికి దారితీస్తుంది.

శరీరంలో ఎన్నో ముఖ్యమైన జీవక్రియలకు నీరు అవసరం. అందుకని కావాల్సినంత నీరు తాగడమే సరైన చర్య అవుతుంది. శరీరంలో నీటి పరిమాణం చాలా అధికంగా చేరితే అప్పుడు ఇన్ టాక్సికేషన్ కు దారితీస్తుంది. నీటి పరిమాణం పెరగడం వల్ల ఎలక్ట్రోలైట్స్ పలుచన అయిపోతాయి. అది శరీర సమతూకం తప్పేలా చేస్తుంది. తలనొప్పి, తల తిరగడం, అయోమయం, వాంతులు, కోమాలోకి వెళ్లడం దీనిలో కనిపిస్తాయి. 

అలాగే శరీరంలో నీటి పరిమాణం తగ్గడాన్ని డీహైడ్రేషన్ గా చెబుతారు. శరీర జీవక్రియల నిర్వహణకు నీరు చాలకపోవడం వల్ల పలు సమస్యలు కనిపిస్తాయి. చెమటలు అధికంగా పట్టడం, విరేచనాలు, వాంతుల వల్ల నీరు తగ్గుతుంది. తగినంత నీరు తాగకపోయినా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. నోరు ఎండిపోవడం, అలసట, దాహం వేయడం అనే లక్షణాలు కనిపిస్తాయి. అలా గంటలు గడిచిన కొద్దీ అవయవాల వైఫల్యం ఏర్పడుతుంది. మొదట కిడ్నీల వైఫల్యం కనిపిస్తుంది. అయితే ఈ రెండింటిలో త్వరగా ప్రాణ ప్రమాదం వాటర్ ఇన్ టాక్సికేషన్ (అధిక నీరు వల్ల) వల్లే వస్తుంది. నీరు బాగా తగ్గిపోయినప్పుడు, ఎక్కువైనప్పుడు శరీరం నుంచి కొన్ని లక్షణాలు, సమస్యలు కనిపిస్తాయి. వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాంతకం కాకుండా చూసుకోవచ్చు. సాధారణ నియమం ప్రకారం 2-3 లీటర్ల వరకు నీరు తీసుకోవాలి. లీటర్ కంటే తగ్గినా, 5 లీటర్ల కంటే పెరిగినా అప్పుడు రిస్క్ వస్తుంది. 

More Telugu News