Team India: టీమిండియాకు మళ్లీ నిరాశే... రెండో టీ20లోనూ ఓటమే!

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు
  • 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన విండీస్
  • 5 మ్యాచ్ ల సిరీస్ లో 2-0తో ముందంజ
Team India loses 2nd T20I

టీమిండియా మరోసారి ఓడింది. వెస్టిండీస్ తో రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ పరాజయం పాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో 153 పరుగుల విజయలక్ష్యాన్ని ఆతిథ్య విండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

ఓ దశలో భారత్ గెలుపునకు అవకాశాలు లభించినా, విండీస్ చివరి వరుస బ్యాట్స్ మెన్ అకీల్ హోసీన్ (16 నాటౌట్), అల్జారీ జోసెఫ్ (10 నాటౌట్) విలువైన పరుగులు జోడించి తమ జట్టును గెలిపించుకున్నారు. 

అంతకుముందు విండీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో టపటపా వికెట్లు పడినా నికోలాస్ పూరన్ రెచ్చిపోయి ఆడాడు. పూరన్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 67 పరుగులు చేశాడు. కెప్టెన్ రోవ్ మాన్ పావెల్ 21, హెట్మెయర్ 22 పరుగులు చేశారు. 

చహల్ ఒకే ఓవర్లో హెట్మెయర్, హోల్డర్ (0)లను అవుట్ చేసి భారత్ కు ఆశలు కల్పించాడు. కానీ ఇతర బౌలర్లు విండీస్ టెయిలెండర్లపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యారు. 

ఈ విజయంతో 5 టీ20 సిరీస్ లో వెస్టిండీస్ తో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 8న జరగనుంది.

More Telugu News