Shamshabad Airport: స్పీకర్లలో రూ.కోటి విలువైన బంగారం.. శంషాబాద్ లో పట్టుబడ్డ స్మగ్లర్లు

  • జెడ్డా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులు
  • అధికారుల తనిఖీల్లో బయటపడ్డ 8 కిలోల బంగారం
  • ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు
Officials seized one crore worth gold being smuggled at Shamshabad Airport

బంగారం ధర పెరుగుతుండడంతో విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని దాచి తీసుకొస్తున్న వారి సంఖ్య  కూడా పెరుగుతోంది. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎన్నుకుంటున్నారు. బంగారాన్ని స్ప్రే రూపంలోకి మార్చి, చీరపై చల్లి తీసుకొస్తూ ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. తాజాగా స్పీకర్లు, ఇస్త్రీ పెట్టెలో భారీ ఎత్తున బంగారాన్ని దాచి తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.కోటికి పైనేనని మీడియాకు వెల్లడించారు.

జెడ్డా నుంచి శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ విమానంలో బంగారం అక్రమ రవాణా జరుగుతోందని అధికారులకు అప్పటికే సమాచారం అందింది. దీంతో ప్రయాణికులను మరింత నిశితంగా పరిశీలించగా.. ఇద్దరు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా కనిపించిందని అధికారులు చెప్పారు. వారు తీసుకొచ్చిన లగేజీని పరిశీలించగా.. ఐదు స్పీకర్లు, ఓ ఇస్త్రీ పెట్టెలో దాచిన 8 కిలోల బంగారం బయటపడింది. మార్కెట్లో దీని విలువ రూ.1.11 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు వివరించారు.

More Telugu News