Ambati Rambabu: ఆ విషయం తెలిసి ప్రజలే చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు: అంబటి

  • జగన్ సీమకు ద్రోహం చేశారని దుష్ప్రచారం చేసేందుకే బాబు పుంగనూరుకు వెళ్లారన్న మంత్రి
  • పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబు కారణమని విమర్శ
  • ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు గ్రీన్ ట్రైబ్యునల్‌కు వెళ్లారని ఆరోపణ
Ambati Rambabu says Punganur people tried to obstruct Chandrababu

సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రాయలసీమకు ద్రోహం చేశారని దుష్ప్రచారం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరుకు వెళ్లారని, అక్కడ హింసను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని మంత్రి అంబటి రాంబాబు శనివారం ధ్వజమెత్తారు. సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబే కారణమన్నారు. పుంగనూరు బైపాస్ నుండి వెళ్తామని చెప్పిన టీడీపీ ఆ తర్వాత పుంగనూరులోకి వచ్చే ప్రయత్నం చేసిందన్నారు. దీంతో పోలీసులు అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు. అడ్డుకున్న పోలీసులపై టీడీపీ కేడర్ రాళ్లు, బీరు బాటిల్స్‌తో దాడి చేసిందన్నారు.

పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి తమ ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించిందన్నారు. భారీ నీటి ప్రాజెక్టులతో పాటు చిన్న చిన్న డ్యాములు కూడా కడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు గ్రీన్ ట్రైబ్యునల్‌కు వెళ్లి స్టే తీసుకు వచ్చారని విమర్శించారు. ఈ విషయం తెలిసిన స్థానికులు చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారని, అదే సమయంలో పోలీసులు కూడా పుంగనూరులోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదన్నారు. దీనికి టీడీపీ కూడా ఓకే చెప్పిందని, కానీ ఆ తర్వాత బైపాస్ నుండి లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా ఘర్షణ చోటు చేసుకుందన్నారు.

More Telugu News