Andhra Pradesh: కారు కొన్న సంతోషంలో దోస్తులకు పార్టీ.. ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం.. నలుగురి మృతి

  • అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన కారు
  • ఓనర్ సహా మరో ముగ్గురు యువకుల మృతి
  • అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాదం
Tragic Accident in Anantapur District Tadipatri Highway

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. కారు కొన్న సంతోషంలో స్నేహితులకు పార్టీ ఇచ్చిన యువకుడు.. అదే కారులో ఇంటికి తిరిగి వెళుతుండగా శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రికి చెందిన మోహన్ రెడ్డి శుక్రవారం సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. అనంతరం తిరిగి వస్తుండగా తాడిపత్రి హైవేపై రావి వెంకటపల్లి గ్రామం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. దీంతో కారు నడుపుతున్న మోహన్ రెడ్డితో పాటు ఆయన స్నేహితులు విష్ణు చౌదరి, నరేశ్ రెడ్డి, మధుసాగర్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. మరో యువకుడు శ్రీనివాసరెడ్డి గాయపడ్డాడు.

 ప్రమాదం విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, మద్యం మత్తులో కారు నడపడం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

More Telugu News