R 5 zone: అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణం ఆపేయండి: ఏపీ హైకోర్టు ఆదేశాలు

  • మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు బెంచ్
  • రాజధాని రైతుల పిటిషన్ల విచారణలో భాగంగా ఆదేశాలు
  • జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్ల పట్టాలను అందించిన ప్రభుత్వం
AP High Court gives stay order on construction of houses in Amaravati R 5 zone

రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్-5 జోన్ లో నిర్మాణాలను ఆపేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ పనులపై స్టే విధిస్తూ త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఈమేరకు ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలంటూ దాఖలైన పిటిషన్ లను విచారిస్తున్న జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన ధర్మాసనం తాత్కాలిక స్టే విధించింది.

జగనన్న కాలనీల పేరుతో రాజధానేతర ప్రాంత వాసులకు ప్రభుత్వం ఆర్-5 జోన్ లో ఇళ్ల పట్టాలను అందజేసింది. ఇందుకోసం రాజధాని ప్రాంతంలో 1400 ఎకరాలను కేటాయించి, 50,793 మందికి ఇళ్ల నిర్మాణ పత్రాలను మంజూరు చేసింది. అయితే, అమరావతిలోని ఆర్-5 జోన్ ఎలక్ట్రానిక్ సిటీ అని, పేదలకు ఇళ్ల స్థలాలను మరోచోట ఇవ్వాలని రాజధాని రైతులు కోర్టుకెక్కారు. ప్రభుత్వ నిర్ణయం సరికాదని, సీఆర్డీఏ ఒప్పందానికి విరుద్దమని కోర్టుకు తెలిపారు.

More Telugu News