Team India: మూడో వన్డేలో గెలుపుతో బోల్డన్ని రికార్డులు బద్దలుగొట్టిన టీమిండియా

  • మూడో వన్డేలో 200 పరుగుల తేడాతో గెలిచిన భారత్
  • విండీస్‌పై భారత్‌కు ఇది రెండో అతిపెద్ద విజయం
  • కరీబియన్ జట్టుపై వరుసగా 13 సిరీస్ విజయాలు
Team India Breaks Multiple Records Against West Indies

వెస్టిండీస్‌తో గత రాత్రి జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారీ విజయం సాధించిన భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 200 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. విండీస్‌పై భారత్‌కు ఇది రెండో అతపెద్ద విజయం. 2018లో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో 224 పరుగులతో గెలుపొందింది.

కరీబియన్ జట్టుపై భారత్‌కు ఇది వరుసగా 13వ సిరీస్ విజయం. 2007-23 మధ్య ఈ విజయాలు సాధించింది. భారత్ తర్వాత జింబాబ్వేపై పాకిస్థాన్ 1996-21 మధ్య వరుసగా 11 విజయాలతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలోనూ పాకిస్థానే ఉంది. విండీస్‌పై 1999-22 మధ్య వరుసగా 10 సిరీస్‌లను సొంతం చేసుకుంది. శ్రీలంకపై వరుసగా పది సిరీస్ విజయాలతో భారత జట్టు నాలుగో స్థానంలో ఉంది. 

ఓపెనర్లు ఇషాన్ కిషన్-శుభమన్ గిల్ కలిసి తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించారు. విండీస్‌పై భారత్‌కు ఇదే అత్యుత్తమ తొలి వికెట్ భాగస్వామ్యం. 2017లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధవన్-అజింక్య రహనే కలిసి 132 పరుగులు జోడించారు. ఇప్పుడా రికార్డును ఇషాన్ కిషన్-శుభమన్ గిల్ చెరిపేశారు.

More Telugu News