విశాఖలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి భూమిపూజ చేసిన వైఎస్ జగన్
- విశాఖలో ఈ ప్రాజెక్టు ఒక ఆణిముత్యంగా నిలిచిపోతుందన్న సీఎం
- రహేజా గ్రూప్కు ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని హామీ
- ఈ మాల్ రాకతో విశాఖ రూపురేఖలు మారుతాయన్న జగన్
- వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న సీఎం
ఈ మాల్ ఇక్కడకు రావడంతో విశాఖపట్నం రూపురేఖలు మారుతాయన్నారు. ఈ మాల్ దక్షిణాదిలోనే అతిపెద్ద మాల్ కావొచ్చునని పేర్కొన్నారు. ఇక్కడ మాల్ కోసం రూ.600 కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్నారని, దీంతో ఎనిమిది వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పన్నెండు, పదమూడు ఎకరాల్లో మాల్ వస్తుందని, ఆ తర్వాత మిగతా నాలుగైదు ఎకరాల స్థలంలో ఫేజ్ 2 కింద ఐటీ స్పేస్ను తయారు చేస్తామన్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించే ప్రణాళికలు ఉన్నాయన్నారు. వీటి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
రానున్న రోజుల్లో విశాఖను గ్లోబల్ చార్ట్లో పెట్టే విధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఇది వరకు అదానీ డేటా పార్క్ను, భోగాపురం విమానాశ్రయానికి భూమిపూజ చేశామని గుర్తు చేశారు. శ్రీకాకుళంలోని మూలపేటలో సీపోర్ట్కూ శంకుస్థాపన చేశామన్నారు. ఇవన్నీ ఉత్తరాంధ్ర రూపురేఖలను పూర్తిగా మార్చుతాయన్నారు. వీటి తర్వాత ఇప్పుడు విశాఖకు సౌతిండియాలోనే అతిపెద్ద మాల్ రానుందన్నారు. విశాఖలో ఒబెరాయ్ హోటల్స్ రానున్నాయన్నారు. మరో హోటల్ చైన్ కూడా ఇక్కడకు రానుందన్నారు.