రాజకీయ రంగ ప్రవేశంపై మౌనికే చెబుతుందన్న మంచు మనోజ్

  • చంద్రబాబు కుటుంబం, తమ కుటుంబానికి సాన్నిహిత్యం ఉందన్న మనోజ్
  • మౌనికతో వివాహం తర్వాత కలుద్దామంటే కుదరలేదని వెల్లడి
  • ఉదయం ఫోన్ చేసి రమ్మంటే వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశామని వ్యాఖ్య
రాజకీయ రంగ ప్రవేశంపై నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం సాయంత్రం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిశారు. 

సతీసమేతంగా వచ్చిన మనోజ్ దాదాపు ముప్పావుగంట పాటు భేటీ అయ్యారు. కుటుంబ వ్యవహారాలు, రాజకీయ అంశాలపై వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది. 

మంచు మనోజ్, ఆయన అర్ధాంగి భూమా మౌనికలు సాయంత్రం చంద్రబాబుతో భేటీ అవుతారని వార్తలు వచ్చినప్పటి నుండే రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ మొదలైంది. టీడీపీ అధినేతతో భేటీ అనంతరం మనోజ్ ఈ అంశంపై స్పందించారు.

రాజకీయాల్లోకి రావడంపై సందర్భం వచ్చినప్పుడు మౌనికనే చెబుతుందని మీడియాకు తెలిపారు. తామంటే చంద్రబాబుకు ఎంతో అభిమానమని చెప్పారు. మౌనికతో వివాహం తర్వాత ఆయనను కలవాలనుకున్నప్పటికీ కుదరలేదని, ఆ తర్వాత చంద్రబాబు బిజీ అయ్యారన్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దామని తనతో అన్నారని, ఈ రోజు ఉదయం ఫోన్ చేసి రమ్మంటే వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. మంగళవారం మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు కూడా తీసుకున్నామన్నారు.

Manchu Manoj
Bhuma mounika
Chandrababu
Telugudesam

More Telugu News