Nirmala Sitharaman: I.N.D.I.A కూటమి ఎంపీలు మణిపూర్ వెళ్లారు కదా.. చూసింది చెప్పాలి: కేంద్రమంత్రి నిర్మల

  • వారి ఆలోచన వారు వేసుకున్న తెల్లదుస్తుల్లా ఉందన్న కేంద్రమంత్రి
  • పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజం
  • అమిత్ షా అక్కడ మూడ్రోజుల పాటు పర్యటించి, పరిశీలించారని వెల్లడి 
Opposition Went To Manipur N Sitharaman

మణిపూర్ అంశంపై విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వారి ఆందోళన నిజమైతే పార్లమెంట్‌లో చర్చకు ముందుకు వచ్చేవారని చెప్పారు. సభ సజావుగా సాగకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ అల్లర్లపై చర్చకు విపక్షాలు ముందుకు రావాలని సవాల్ చేశారు. ఈ అంశంపై తాము చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ, విపక్షాలు వెనుకడుగు వేస్తున్నాయన్నారు.

మణిపూర్‌లో పరిస్థితులను ప్రత్యక్షంగా చూసేందుకు వెళ్లిన I.N.D.I.A కూటమి ఎంపీలు అక్కడ ఏం చూశారు? అక్కడి ప్రజలు వాళ్లకు ఏం చెప్పారో.. వారు చెబితే వింటామన్నారు. I.N.D.I.A కూటమి ఎంపీలు గత వారం మణిపూర్‌లో పర్యటించారని, సహాయక శిబిరాల్లో ఉన్న పలువురితో మాట్లాడారని, ఇది కేవలం ప్రజలను వంచించడమే అన్నారు. అక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు తప్ప ఇంకేం చేయడం లేదన్నారు. 

మణిపూర్.. మణిపూర్ అని అరుస్తున్నారు తప్ప ఏం లేదన్నారు. అల్లర్లపై చర్చించాలని వారు అడిగారని, అందుకు తాము సిద్ధపడ్డామని, కానీ వారు చర్చకు ముందుకు రావడం లేదన్నారు. వారి ఉద్ధేశ్యం సభను అడ్డుకోవడమే అన్నారు. వారి ఆలోచన వారు వేసుకున్న తెల్ల దుస్తులలా ఉందన్నారు. అప్పట్లో ఏ హోంమంత్రి కూడా రాష్ట్ర పర్యటనకు వెళ్లలేదని, కానీ ప్రస్తుతం విషయం తెలిసిన వెంటనే అమిత్ షా మణిపూర్ లో మూడ్రోజుల పాటు పర్యటించారన్నారు. అమిత్ షా అక్కడి పరిస్థితులను పరిశీలించి, సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి వద్దకు వెళ్లి భరోసా కల్పించారన్నారు.

More Telugu News