K Kavitha: నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని ప్రారంభించాలని గ్లోబల్ లాజిక్‌ను కోరిన కవిత

  • హిటాచీ గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ ప్రతినిధులతో కవిత భేటీ
  • రవాణా, నీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలపై ప్రతినిధులకు వివరించిన ఎమ్మెల్సీ
  • ఐటీ హబ్ వరకు బస్సులను వేయించే ప్రయత్నం చేస్తానన్న బాజిరెడ్డి
Kavitha meets Company delegates in Hyderabad

నిజామాబాద్‌లో ఐటీ కంపెనీని ఏర్పాటు చేయాలని హిటాచీ గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్‌ను బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం కోరారు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లి హైదరాబాద్‌లో కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె... త్వరలో నిజామాబాద్ ఐటీ హబ్ ప్రారంభం కానుందని, ఐటీ సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. నిజామాబాద్ ఐటీ హబ్ గురించి వారితో చర్చించారు. రవాణా, నీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలు, శాంతిభద్రతలపై కవిత వారికి వివరించారు. 

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు వేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ... మున్ముందు నిజామాబాద్‌లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. భవిష్యత్తులో తమ కంపెనీని తెలంగాణలో మరిన్ని ప్రాంతాలకు విస్తరింప చేస్తామన్నారు.

More Telugu News