Jaipur Express: జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు.. ఏఎస్సై, ముగ్గురు ప్రయాణికుల మృతి

  • ఈ తెల్లవారుజామున ఘటన
  • తొలుత ఏఎస్సైని కాల్చి చంపిన నిందితుడు
  • ఆపై మరో బోగీలోకి వెళ్లి ప్రయాణికులపై కాల్పులు
  • చైన్ లాగి రైలు నుంచి దూకి పారిపోయే యత్నం
RPF jawan shoots four dead in Jaipur Mumbai train

రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. రైలు మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటి వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగింది. 

ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్‌కుమార్ చౌదరి ఉన్నట్టుండి ఆర్పీఎఫ్ ఏఎస్సై టికారామ్ మీనాపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత మరో బోగీలోకి వెళ్లి ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. దీంతో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. 

కాల్పుల అనంతరం నిందితుడు దహిసర్ స్టేషన్ వద్ద చైన్ లాగి రైలు నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి అతడి నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బీ5 కోచ్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కాల్పులకు గల కారణం తెలియాల్సి ఉంది.

More Telugu News