K Kavitha: తనయుడి మరణంతో తీవ్ర విషాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే... పరామర్శించిన కవిత

  • పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పుత్రశోకం
  • కాలేయ వ్యాధికి చికిత్స పొందుతూ గుండెపోటుకు గురైన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి
  • తమ ఎమ్మెల్యేని ఓదార్చిన కవిత
  • మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వైనం
Kavitha consoles BRS MLA Mahipal Reddy who lost his son

బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న విష్ణువర్ధన్ రెడ్డి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. దాంతో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో విద్యార్థి నేతగా ఎదిగారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఈ లోకాన్ని వీడడంతో మహిపాల్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో, తమ పార్టీ సహచరుడ్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. 

పుత్రశోకంతో కుమిలిపోతున్న మహిపాల్ రెడ్డిని ఆమె ఓదార్చారు. విష్ణువర్ధన్ రెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని, తండ్రి మహిపాల్ రెడ్డికి రాజకీయ వారసుడిగా ఎదుగుతున్న తరుణంలో ఇలా జరగడం అత్యంత దురదృష్టకరమని కవిత పేర్కొన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

More Telugu News