Andhra Pradesh: నెల్లూరులో ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం

  • ట్రాక్ మధ్యలో రెండు మీటర్ల పొడవైన రైలు పట్టా
  • దానిని ఢీ కొట్టిన నర్సాపురం - ధర్మవరం ఎక్స్ ప్రెస్ రైలు
  • ఎగిరి దూరంగా పడిపోవడంతో తప్పిన పెను ప్రమాదం
Passengers are Safe in Nellore Train Accident

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో నర్సాపురం - ధర్మవరం ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ట్రాక్ పై అడ్డుగా ఉన్న రైలు పట్టా ముక్కను ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఢీ కొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ ఆ ఇనుప ముక్క ఎగిరి దూరంగా పడింది. దీంతో ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. కావలి - బిట్రగుంట స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ట్రాక్ పై రైలు పట్టా ముక్కను పెట్టింది ఎవరనేది గుర్తించేందుకు రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఆదివారం తెల్లవారుజామున కావలి - బిట్రగుంట స్టేషన్ల మధ్యలో ముసునూరు వద్ద రైల్వే ట్రాక్ పై దుండగులు రైలు పట్టాను పెట్టారు. దాదాపు రెండు మీటర్ల పొడవైన రైలు పట్టాను ట్రాక్ కు అడ్డంగా పెట్టారు. అదే ట్రాక్ పై నర్సాపూర్ - ధర్మవరం ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా వచ్చింది. రైలు, పట్టాను ఢీ కొట్టగా.. ఆ వేగానికి రైలు పట్టా దూరంగా ఎగిరిపడింది. ఇలా ఎగిరి పక్కన పడడం వల్లే ప్రమాదం తప్పిందని, లేదంటే పెను ప్రమాదం జరిగేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు పట్టాను ట్రాక్ పై పెట్టిన దుండగులను పట్టుకుని చట్ట ప్రకారం శిక్షిస్తామని వివరించారు.

More Telugu News