Vande Bharat: ‘వందేభారత్‌’లో ఫుడ్ ఆర్డరిస్తే పార్శిల్‌లో బొద్దింక.. ప్రయాణికుడు షాక్

  • భోపాల్ నుంచి గ్వాలియర్ వెళుతున్న రైల్లో జులై 24న ఘటన
  • చపాతీలో బొద్దింక ఉన్న దృశ్యాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో బాధితుడి ఫిర్యాదు
  • వెంటనే స్పందించిన రైల్వే.. బాధితుడికి క్షమాపణలు
  • ఆహారం సరఫరా చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ
  • బాధితుడికి మరో పార్శిల్‌ను తక్షణం ఏర్పాటు చేసిన ఐఆర్‌సీటీసీ
Cockroach Found in Meal Served on Vande Bharat Train IRCTC Responds

వందేభారత్‌ రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. రైల్లో తనకు ఇచ్చిన చపాతీల్లో బొద్దింక కనబడటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు సోషల్ మీడియాలో ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు చేశాడు. జులై 24న భోపాల్ నుంచి గ్వాలియర్ వెళుతున్న రైల్లో ఈ ఘటన వెలుగు చూసింది. తనకిచ్చిన ఆహారం పార్శిల్‌లోని చపాతీపై చిన్న బొద్దింకను సుబోధ్ పహలాజన్ గుర్తించాడు. వెంటనే దాన్ని ఫొటో తీసి నెట్టింట్లో షేర్ చేస్తూ ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేశారు. ‘‘ వందేభారత్ రైల్లో నాకు ఇచ్చిన ఫుడ్‌లో బొద్దింక కనిపించింది’’ అని ట్వీట్ చేశారు. 

ఈ ఫిర్యాదుపై రైల్వే వెంటనే స్పందించింది. ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పిన రైల్వే శాఖ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. పీఎన్ఆర్ నెంబర్, ఇతర వివరాలను నేరుగా మెసేజ్ చేస్తే తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇలాంటి ఘటనలను అస్సలు సహించబోమని ఐఆర్‌సీటీసీ పేర్కొంది. ప్రయాణికుడికి ఐఆర్‌సీటీసీ ఆ తరువాత మరో పార్శిల్‌ను ఏర్పాటు చేసినట్టు భోపాల్ డివిజన్ రైల్వే మేనేజర్ తెలిపారు. ఆహార సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై తగు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

More Telugu News