Nara Lokesh: బీసీలకు న్యాయం చేసిన చరిత్ర మాదే, చేయబోయే చరిత్రా మాదే: నారా లోకేశ్

  • ప్రకాశం జిల్లాలో నారా లోకేశ్ యువగళం
  • ఒంగోలులో జయహో బీసీ సభ
  • రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన బీసీలు
  • యాంకర్ గా వ్యవహరించిన ఉదయభాను
Lokesh attends Jayaho BC

చట్టాలను అమలుచేసే పాలకుడే 420, ఆర్థిక నేరగాడైతే సమాజంలో సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం రథసారధి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఒంగోలు శివారు రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట నిర్వహించిన జయహో బీసీ సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున బీసీలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఉదయభాను సంధానకర్తగా వ్యవహరించారు.
జయహో బీసీ సదస్సులో అడిగిన ప్రశ్నలు – లోకేశ్ సమాధానాలు:

యాంకర్ ఉదయభాను: 167 రోజులుగా పాదయాత్ర నిర్విరామంగా చేస్తున్నారు. మీకు అలసట రావడం లేదా? మండుటెండలు, వర్షాలను సైతం లెక్కచేయకుండా 2,200 కిలోమీటర్లు ఎలా నడిచారు? ఎందుకు నడుస్తున్నారు?

లోకేశ్: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు యువగళం చేపట్టాను. ఈ సుదీర్ఘ పాదయాత్రలో అట్టడుగు స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా చూడగలిగాను. పాదయాత్రలో ప్రజల స్పందన బాగుంది. కార్యకర్తలు, నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు. 

రేపటికి 2,200కిలోమీటర్ల మైలురాయి దాటబోతున్నాను. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నా ప్రయాణం ఆగదు. ఇచ్ఛాపురం చేరుకునేవరకు విశ్రమించేది లేదు.

యాంకర్ ఉదయభాను: జయహో బీసీ ఎందుకు పెట్టారు?

లోకేశ్: బీసీల పట్ల మా చిత్తశుద్ధిని గతంలో అనేక కార్యక్రమాల ద్వారా మేం చేసి చూపించాం. ఎన్టీఆర్ సీఎం అయ్యాక పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. బీసీలను మంత్రులు, ఎంపీలు, స్పీకర్లను చేశారు. 

ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల్లో 24 శాతం రిజర్వేషన్ కల్పిస్తే చంద్రబాబు దీన్ని 34 శాతానికి పెంచారు. బీసీ సబ్ ప్లాన్ పెట్టి, నిధులు కేటాయించి కేవలం బీసీలకే చంద్రబాబు ఖర్చు పెట్టారు. పాదయాత్రలో బీసీల సమస్యలను ప్రతి ఒక్కటీ తెలుసుకుంటున్నాను. మరిన్ని సమస్యలు తెలుసుకునేందుకే జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

విజయగౌరి యాదవ్, నంద్యాల: టీడీపీ పాలనలో బీసీ విద్యార్థులకు విదేశీ విద్య పథకాన్ని ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. మీరు అధికారంలోకి వస్తే విదేశీ విద్య పథకాన్ని తెస్తారా?

లోకేశ్: బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన చరిత్ర మాదే..., రానున్న కాలంలో మరిన్ని చేసి చరిత్ర సృష్టించేది మేమే. టీడీపీ పాలనలో బడుగు, బలహీనవర్గాలను విదేశాలకు పంపాలని సంకల్పించింది తెలుగుదేశం పార్టీ. 

దీనిలో భాగంగానే చంద్రబాబు విదేశీ విద్య పథకాన్ని తెచ్చి అమలు చేశారు. అనేక మంది ఈ పథకంలో భాగంగా విదేశాలకు వెళ్లి చదువుకుని స్థిరపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలకు ద్రోహం చేశారు. మేం అధికారంలోకి వచ్చాక విదేశీవిద్య పథకాన్ని కొనసాగిస్తాం. అవసరమైన ఏర్పాట్లు మేం చేస్తాం.

షేక్ అజిమున్, ఒంగోలు: బీసీ మహిళలపై వైసీపీ ప్రభుత్వం అనేక అరాచకాలకు పాల్పడుతోంది. మాకు ఎస్సీ, ఎస్టీ తరహా చట్టం తెస్తారా? మాకు రక్షణ కల్పిస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం నాపై అక్రమంగా 14 కేసులు పెట్టారు.

లోకేశ్: వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. నాపై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసులు పెట్టారు. బీసీలకు రక్షణ చట్టాన్ని మేం అధికారంలోకి వచ్చిన మొదటి సంత్సరంలోనే తెస్తాం. న్యాయపోరాటానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించే అంశాన్ని ఈ చట్టంలో భాగంగా రూపొందిస్తాం.

హేమశ్రీ, అమర్నాథ్ గౌడ్ అక్క, రేపల్లె, బాపట్ల జిల్లా: నన్నుఏడాదిన్నర నుండి వైసీపీ కార్యకర్తలు ఏడిపిస్తున్నారు. నా తమ్ముడు ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. కేసు కూడా సరిగా నమోదు చేయలేదు. 

టీడీపీ నాయకులు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీసీలు ఏమీ చేయలేరు, ప్రశ్నించలేరని తక్కువ అంచనా వేస్తున్నారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ నాకు అండగా నిలచింది.

లోకేశ్: అక్కని ఏడిపిస్తే స్పందించిన తమ్ముడిని కిరాతకంగా చంపి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ సోషల్ మీడియాలో అమర్నాథ్ గౌడ్ ది ఆత్మహత్య అంటూ ఫేక్ పోస్టులు ప్రచారం చేస్తున్నారు. మీ ఇళ్లల్లో మీ ఆడబిడ్డలకు ఇలాగే జరిగితే ఇలాగే చేస్తారా? 

అమర్నాథ్ గౌడ్ విలవిల్లాడుతూ చనిపోతే ముఖ్యమంత్రికి కనీసం కనికరం కలుగలేదు. అధికారంలోకి రాకముందు గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పి, నేటికీ ఈ చెల్లెమ్మ వద్దకు రాలేదు? మంత్రి జోకర్ జోగి బాధిత కుటుంబం వద్దకు వెళ్లి బేరసారాలు ఆడి అవమానించారు. ఈ బాధిత కుటుంబాన్ని చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. 

నాకు చెల్లిలేని లోటు తెలుసు. ఇలాంటి పరిస్థితి మరో చెల్లికి, అక్కకి ఎదురవకుండా చూసే బాధ్యతను ఈ లోకేశ్ తీసుకుంటాడు. 

యాంకర్ ఉదయభాను: కులవృత్తులు టెక్నాలజీతో పోటీపడేలా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గాండ్ల సామాజికవర్గ ప్రజలు తయారుచేసే నూనెను ప్రభుత్వం కొనేలా చర్యలు తీసుకుంటారా?

లోకేశ్: మా మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలు ఉన్నారు. వారికి టీడీపీ పాలనలో అనేక సబ్సిడీ పథకాలు ఇచ్చి ఆదుకున్నాం. చేనేతల ఉత్పత్తులను టాటా కంపెనీ కొనుగోలు చేసేలా ఓ వేదిక ఏర్పాటు చేశాం. 

మెరుగైన టెక్నాలజీతో కులవృత్తులు అనుసంధానం కావాలి, మార్కెటింగ్ ఏర్పాటు చేయాలి. దీనికి ఓ ప్లాట్ ఫాం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. కులవృత్తుల వారికి సబ్సిడీలు ఇచ్చే చర్యలు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. 

యాంకర్ ఉదయభాను: బీసీలకు సబ్సిడీ రుణాలు ఇప్పించే చర్యలు ఏమైనా చేపడతారా?

లోకేశ్: టీడీపీ అధికారంలోకి వచ్చాక దామాషా ప్రకారం ఉపకులాల వారీగా నిధులు కేటాయిస్తాం, కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. కార్పొరేషన్లకు ఇచ్చే నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించం. కేవలం సబ్సిడీ రుణాల కోసం మాత్రమే కార్పొరేషన్ నిధులు ఇస్తాం. 

వైసీపీ పాలనలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పేషీ ఉద్యోగులకు 6నెలలు పాటు జీతాలు రాక పేషీకి తాళం వేసిన దుస్థితి ఉంది. వైసీపీ పెట్టిన కార్పొరేషన్ డైరెక్టర్లకు, చైర్మన్లకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు.

కొఠారి నాగేశ్వర యాదవ్, ఒంగోలు: ఎన్టీఆర్, చంద్రబాబు బీసీలను గుర్తించి ప్రోత్సహించారు. 2024లో అధికారంలోకి వచ్చాక వారసత్వ నాయకులను కాకుండా కష్టపడే నాయకులను గుర్తిస్తారా?

లోకేశ్: బీసీల్లోని చిన్న చిన్న కులాలకు చెందిన నాయకులను పైకి తీసుకురావడమే మా లక్ష్యం. పార్టీకి బాగా కష్టపడుతూ, ప్రజల మధ్య ఉన్నవారికి పెద్దపీట వేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుంది. సీనియర్, జూనియర్లను సమానంగా గౌరవిస్తా, పనిచేసేవారిని ప్రోత్సహిస్తా. 

రాష్ట్రం నేడు గాడితప్పింది. దాన్ని గాడిలో పెట్టేదానికి కష్టపడిన వారికి ప్రాధాన్యతనిచ్చే బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను.

బ్రహ్మంగౌడ్, కనిగిరి: పక్క రాష్ట్రంలో గౌడ కులానికి నీరా ప్రాజెక్టు, మద్యం దుకాణాల్లో 50 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు తెలంగాణ మాదిరి న్యాయం చేస్తారా?

లోకేశ్: ఏపీలో అధికారంలోకి రాకముందు మద్యం నియంత్రణ అని చెప్పి, అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక గౌడ కులస్తులకు నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తాం. మద్యం దుకాణాల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తాం.

ఆడియన్స్: విశ్వబ్రాహ్మణులకు జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వలేదు. టీడీపీ వచ్చాక మాకు ఎమ్మెల్సీ ఇవ్వాలి.

లోకేశ్: రజకుల మాదిరే విశ్వబ్రాహ్మణులను జగన్ మోసం చేశాడు. టీడీపీ వచ్చాక రాజకీయంగా విశ్వబ్రాహ్మణులను టీడీపీ ప్రోత్సహిస్తుంది.

రామాంజనేయులు, పర్చూరు: మత్స్యకారులను మీరు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఆదుకుంటారు?

లోకేశ్: చెరువులపై మత్య్సకారులకు హక్కులు లేకుండా 217 జీవో తెచ్చారు. ఆ జీవోను మేమొచ్చాక రద్దు చేస్తాం. మత్య్సకారులకు బోట్లు, వలలు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వంలో ఇవ్వడం లేదు. అందరికీ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే మీకూ ఇస్తున్నారు. మిమ్మల్ని అడ్డంగా పెట్టుకుని బూతులు తిడుతున్నారు. 

బీసీ సోదరులకు జోగి రమేశ్ ఏం చేశాడు? జగన్ ఏం చేశాడు? టీడీపీని బీసీలు ఆదరించాలి. సైకోను శాశ్వతంగా ఇంటికి పంపితేనే రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రక్షణ సాధ్యమవుతుంది.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2197.1 కి.మీ.*

*168వరోజు (28-7-2023) యువగళం వివరాలు*

*ఒంగోలు/ సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాలు (ప్రకాశం జిల్లా)*

మధ్యాహ్నం 

2.00 – ఒంగోలు రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట క్యాంప్ సైట్ లో గ్రానైట్ ఫ్యాక్టరీ కార్మికులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – ఒంగోలు రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.10 – మంగమ్మకాలేజి జంక్షన్ లో యువతతో సమావేశం.

4.40 – అగ్రికల్చర్ మార్కెట్ యార్డు వద్ద రైతులతో సమావేశం.

5.30 – త్రోవగుంట వద్ద పాదయాత్ర 2200 కి.మీ. చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

5.50 – పాదయాత్ర సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశం.

6.35 – ఏడుగుండ్లపాడులో స్థానికులతో సమావేశం.

8.35 – సీతారాంపురం కొష్టాల వద్ద పొగాకు రైతులతో సమావేశం.

9.35 – మద్దిపాడులో స్థానికులతో సమావేశం.

10.35 – వెల్లంపల్లిలో మహిళలతో సమావేశం.

11.35 – గుండ్లాపల్లిలో గ్రానైట్ కార్మికులతో సమావేశం.

12.05 – గుండ్లాపల్లి శివారు విడిది కేంద్రంలో బస.

******

More Telugu News