Narendra Modi: క్విట్ 'ఇండియా' అంటూ విపక్ష కూటమిపై ప్రధాని మోదీ ఫైర్

  • రాజస్థాన్ లోని సికార్ లో బహిరంగ సభ
  • హాజరైన ప్రధాని మోదీ
  • యూపీఏ హయాంలో ఘనకార్యాలు చేశారంటూ విమర్శలు
  • వాటిని కప్పిపుచ్చుకోవడానికే కూటమి అంటూ వ్యాఖ్యలు
  • అహంకారంతో ఉన్నారంటూ ఆగ్రహం
Modi fires on INDIA Alliance

నేషనల్ డెవలప్ మెంట్ ఇంక్లుజివ్ అలయన్స్ (I.N.D.I.A) పేరిట తమకు వ్యతిరేకంగా కూటమి కట్టిన విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. నాడు మహాత్మా గాంధీ క్విట్ ఇండియా నినాదం చేశారని, ఇప్పుడు అవినీతి, రాజకీయాలను దేశం నుంచి పారదోలేందుకు క్విట్ ఇండియా అనాల్సి వస్తోందని విమర్శించారు. 

రాజస్థాన్ లోని సికార్ లో ఏర్పాటు చేసిన ఓ భారీ సభలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, I.N.D.I.A అనే ముద్ర వేసుకుని, గతంలో యూపీఏ హయాంలో తాము చేసిన ఘన కార్యాలయాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వారు నిజంగా భారతదేశం పట్ల శ్రద్ధ ఉన్నవారైతే, మన వ్యహారాల్లో జోక్యం చేసుకోవాలని విదేశీయులను కోరతారా? అని ప్రశ్నించారు. 

"క్విట్ ఇండియా అన్నది మహాత్మాగాంధీ నినాదం. అవినీతిపరులు, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు, మందీమార్బలంతో రాజకీయాలు చేయాలనుకునేవారు దేశం విడిచిపోవాలంటే మేం ఇవాళ క్విట్ ఇండియా (I.N.D.I.A) అంటున్నాం. 

గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ.... ఇండియా అంటే ఇందిరానే, ఇందిరా అంటే ఇండియానే అని ప్రచారం చేసుకున్నారు.... కానీ ప్రజలు ఆమెను ఓడించారు. ఇప్పుడీ అహంకారులు మరోసారి అలాంటి నినాదమే చేస్తున్నారు. 

కాంగ్రెస్ ఒక దశాదిశ లేని పార్టీ. కుంభకోణాల్లో చిక్కుకున్న కంపెనీలు ఎలా పేర్లు మార్చుకున్నాయో, కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు కూడా అలాగే కొత్త పేర్లతో వస్తున్నాయి" అంటూ మోదీ ధ్వజమెత్తారు.

More Telugu News