MS Dhoni: హీరోగా ఎంఎస్ ధోనీ.. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా అంటున్న భార్య సాక్షి

  • సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చిన ధోనీ దంపతులు
  • తొలి సినిమాగా ఎల్‌జీఎం నిర్మాణం
  • ప్రమోషన్స్‌లో బిజీగా సాక్షి ధోనీ
I welcome Dhoni As Hero if he wants says Wife Sakshi

భారత జట్టు ద్వారా ఎన్నో విజయాలు అందించి దిగ్గజ క్రికెటర్‌‌గా ఎదిగిన మహేంద్ర సింగ్ ధోనీ ఆటకు రిటైర్మెంట్‌ ఇచ్చిన తర్వాత పలు వ్యాపారాలు చేస్తున్నారు. తాజాగా ఆయన ధోనీ ఎంటర్‌‌ టైర్మెంట్‌ అనే సంస్థను స్థాపించి సినిమా రంగంలోకి వచ్చారు. ఈ బ్యానర్‌‌ నుంచి ధోనీ భార్య సాక్షి ప్రొడ్యూసర్‌‌గా తెలుగు, తమిళ్‌లో ఎల్‌జీఎం (లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌) అనే తొలి సినిమా వస్తోంది. అత్తా, కోడలు మధ్య జరిగే అసక్తికర ఘటనలతో కూడిన ఈ సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా సాక్షి ధోనీ హైదరాబాద్‌ వచ్చారు. ఈ క్రమంలో తన అత్త గురించి, ధోనీ గురించి అడిగిన ప్రశ్నలకు సాక్షి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ధోనీ తల్లి తనతో చాలా స్నేహంగా ఉంటారన్నారు. 

‘మా పెళ్లికి ఒక్క రోజు ముందే మా అత్తగారిని కలిశా. మేమిద్దరం చాలా స్నేహంగా ఉంటాం. ఆమె నన్ను చాలా సపోర్ట్ చేస్తుంది. ఎంతో సరదాగా ఉంటుంది. ఇంట్లో మా మావయ్యే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అందుకే ధోనీలో అంత క్రమశిక్షణ ఉంది’ అని తెలిపారు. ఇక ధోనీని హీరోగా చూడొచ్చా అన్న ప్రశ్నకు సాక్షి సమాధానం చెప్పారు.
‘ఆయన హీరోగా సినిమాల్లోకి వస్తే బాగానే ఉంటుంది. రావాలని నేను కోరుకుంటున్నా. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా. అది నిజమైతే నా జీవితంలో సంతోషకరమైన రోజు అవుతుంది’ అని చెప్పుకొచ్చారు. తెలుగులో ప్రభాస్, రామ్‌ చరణ్ లాంటి బడా హీరోలతో సినిమా తీయాలంటే వారికి భారీ పారితోషికం ఇవ్వాల్సి ఉంటుందని, అంత బడ్జెట్‌ తమ దగ్గర లేదన్నారు. తమ కంపెనీని ఇప్పుడే మొదలు పెట్టి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

More Telugu News