rk roja: హాలిడేకు వచ్చినట్లు ఏపీకి వచ్చి రైతులపై కల్లబొల్లి ప్రేమను కనబరుస్తున్నారు: చంద్రబాబుపై రోజా విమర్శలు

  • వ్యవసాయం దండగ అన్న వ్యక్తిని నమ్మరన్న రోజా  
  • చంద్రబాబు రైతుల జీవితాలను నాశనం చేశారని ఆరోపణ
  • 'చంద్రబాబు, కరవు కవలలు' అంటూ ఎద్దేవా
RK Roja satire on Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి రోజా బుధవారం నిప్పులు చెరిగారు. హాలిడేకు వచ్చినట్లుగా రాష్ట్రానికి వచ్చి రైతులపై కల్లబొల్లి ప్రేమను కనబరుస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రైతుల జీవితాలను నాశనం చేశారని దుయ్యబట్టారు. గతంలో రైతులపై కాల్పులు జరిపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు, కరవు కవలలు అని అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి ఇప్పుడు రైతుల కోసం ఏదో చేస్తానంటే నమ్మలేరన్నారు.

ఇదిలా ఉండగా, రోజా గుడివాడ నియోజకవర్గస్థాయి సమీక్షలో పాల్గొన్నారు. ఆమె కృష్ణా జిల్లాకు ఇంఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కొడాలి నాని హాజరయ్యారు. నియోజకవర్గంలో అన్ని పభుత్వ శాఖలు సమీక్షించామని, అభివృద్ధి పనులపై సమీక్షించి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తెలుసుకున్నామని రోజా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గుర్తించిన సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా, నియోజకవర్గ అధికారులకు తెలియజేసి, తగు పరిష్కారాలకై చర్చించి తగు సలహాలు సూచనలు చేసి ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆదేశించినట్లు తెలిపారు.

More Telugu News