Pawan Kalyan: మహిళల మిస్సింగ్‌పై కేంద్ర గణాంకాలను జగన్ ప్రభుత్వం తప్పుపడుతుందా?: జనసేన

  • వైసీపీ ప్రభుత్వాన్ని మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందా? అని నిలదీత
  • మహిళలు, బాలికల అదృశ్యంపై జగన్ సర్కార్ ఇప్పుడేం చెబుతుందని ప్రశ్న
  • కేంద్రం ఇచ్చిన సమాచారాన్ని చదువుకోవాలని హితవు
Janasena on Women missing in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, బాలికల అదృశ్యంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీలో 30,198 మంది మహిళలు, బాలికలు అదృశ్యమైనట్లు పార్లమెంటులో కేంద్రమంత్రి ప్రకటించారని, దీనిపై ఏపీ మహిళా కమిషన్ బహిరంగంగా మాట్లాడగలదా? అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వాన్ని మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందా? అన్నారు. కేంద్రమంత్రి ప్రకటనపై హోంమంత్రి, డీజీపీ స్పందించాలన్నారు. ఈ మేరకు జనసేన పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

మహిళలు, బాలికల అదృశ్యంపై జగన్ సర్కార్ ఇప్పుడేం చెబుతుంది? అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీలో మహిళలు, బాలికల మిస్సింగ్ కు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఇచ్చిన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వ పెద్దలు చదువుకోవాలని సూచించింది. 2019 నుండి 2021 మధ్య మూడేళ్ల కాలంలో 30వేల మందికి పైగా అదృశ్యమైనట్లు చెప్పారని వెల్లడించింది. ఇదే విషయాన్ని పవన్ తన వారాహి యాత్రలో చెప్పారని, జగన్ ప్రభుత్వంలోని మంత్రుల నుండి పోలీసు ఉన్నతాధికారుల వరకు ఈ వాస్తవాలపై అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాక్ట్ చెక్ పేరుతో తప్పుడు లెక్కలు చూపించి మసిపూసి మారేడు కాయ చేసిన అధికార యంత్రాంగం ఇప్పుడు కేంద్రం లెక్కలు వచ్చాక ఏం చెబుతుందని ప్రశ్నించింది.

కేంద్ర హోంశాఖ ఇచ్చిన గణాంకాలను జగన్ ప్రభుత్వం తప్పుపడుతుందా? ఆ లెక్కలను విమర్శిస్తూ ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఏమైనా చెబుతుందా? అని జనసేన ప్రశ్నించింది. ఏపీలో మహిళలు, బాలికల అదృశ్యం సమస్య ఎంత తీవ్రంగా ఉందో పవన్ గ్రహించారని తెలిపింది. ఆ తీవ్రత నేపథ్యంలోనే గణాంకాల ఆధారంగా తెలియజేస్తూ పవన్ ప్రసంగించారని పేర్కొంది. వాస్తవాలను అంగీకరించలేని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందన్నారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ సభ్యత మరిచిపోయి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారని పేర్కొంది. ఇకనైనా ప్రభుత్వం మహిళలు, బాలికల రక్షణపై దృష్టి పెట్టాలని సూచించింది.

More Telugu News