TDP: చేతగాని ప్రభుత్వంతో నష్టం ఏంటనేది జగన్ పాలనతో తెలిసింది: చంద్రబాబు

  • గత నాలుగున్నర ఏళ్లుగా ఏపీ ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారని వ్యాఖ్య
  • రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేడన్న టీడీపీ చీఫ్
  • వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బంది పడుతున్నా సీఎం ఒక్క సమీక్ష జరపలేదని విమర్శ
Tdp chief Chandrababu Naidu Press Meet

చేతగాని ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండలేరని జగన్ పాలనతో అందరికీ అర్థమైందని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు పేర్కొన్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బంది పడుతున్నా సీఎం జగన్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఏంచేయాలనే ఆలోచన లేదని, అధికారులతో ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా జరపలేదని మండిపడ్డారు. ఈమేరకు మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు.

జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలోని రైతులు అప్పుల పాలయ్యారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలోని 93 శాతం రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా 7 శాతం కూడా వారి పిల్లలు ఉద్యోగం చేస్తూ డబ్బులు పంపిస్తే అప్పులపాలు కాకుండా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని రైతుల సగటు రుణం రూ.2,45,554 లుగా ఉందని, దేశంలో రైతుల అప్పు సగటున రూ.74 వేలు ఉందని చెప్పారు. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య రైతుల సగటు అప్పు నాలుగు రెట్లు ఎక్కువని వివరించారు.

ఓ ఎకరా అమ్మి కట్టేద్దామని అనుకున్నా అప్పు మొత్తం తీరేలా లేదని, భూములకు విలువ లేకపోవడమే దీనికి కారణమని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలోనే కాదు.. ఎక్కడైనా సరే అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుంది, ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తే సాగు భూముల ధరలు పెరుగుతాయని చెప్పారు. అధికారంపై జగన్ కు ఉన్న వ్యామోహం, దోపిడీపై ఆయనకున్న ప్రేమ ఆంధ్రప్రదేశ్ కు శాపంగా మారే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు.

More Telugu News