Anju: అంజు మానసిక పరిస్థితి బాగాలేదు.. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌కోసం పాకిస్థాన్ వెళ్లిన యువతి తండ్రి

  • ఆమెకు, తమకు చాలా ఏళ్లుగా సంబంధాలు లేవన్న అంజు తండ్రి
  • చిన్నప్పటి నుంచి మేనమామ ఇంటి వద్దే పెరిగిందన్న గయ ప్రసాద్
  • తన కుమార్తెది అసాధారణ మనస్తత్వమని వివరణ
  • మరొకరితో సంబంధాలు పెట్టుకునే రకం కాదని స్పష్టీకరణ
Father of Indian woman Andj who went to Pak for Facebook friend says that her daughter Mentally disturbed

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ వెళ్లిన వివాహిత యువతి అంజు (34) కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఆమెకు తనకు మధ్య ఉన్నది ప్రేమ కాదని, తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని ఆమె పాకిస్థాన్ ఫ్రెండ్ నస్రుల్లా (29) ఇప్పటికే తేల్చి చెప్పాడు. తాజాగా అంజు తండ్రి గయ ప్రసాద్ థామస్ మాట్లాడుతూ.. ఆమె మానసిక స్థితి బాగాలేదని పేర్కొన్నారు. 

అంజు పాకిస్థాన్ వెళ్లిన విషయం కుమారుడి ద్వారానే తనకు తెలిసిందన్నారు. ఆమె పెళ్లి చేసుకుని రాజస్థాన్‌లోని భివాండీ వెళ్లిపోయిన తర్వాత దాదాపు 20 ఏళ్లుగా సంబంధాలు లేవని పేర్కొన్నారు. ఆమెను తానెప్పుడూ ఆహ్వానించలేదని తెలిపారు. అంజు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచీ యూపీలోని జలౌన్ జిల్లాలో మేనమామ ఇంట్లోనే ఉంటోందని, అక్కడే పెళ్లి చేసుకుందని వివరించారు.  

అయితే, ఆమె ఎవరికీ చెప్పకుండా పాకిస్థాన్ వెళ్లడం తప్పేనని పేర్కొన్నారు. అల్లుడు చాలా మంచివాడని, మరో వ్యక్తితో తన కుమార్తె సంబంధం పెట్టుకునే రకం కాదని, ఈ విషయంలో తాను గ్యారెంటీ ఇవ్వగలనని చెప్పారు. ఆమె 12వ తరగతి వరకు చదువుకుందని, ఆ తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరినా ఆమె అసాధారణ మనస్తత్వం కారణంగా ఉద్యోగం మానేసిందని వివరించారు.

కాగా, అంజుకు తనకు మధ్య ఎలాంటి అఫైర్ లేదని, ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని నస్రుల్లా తెలిపాడు. ఆగస్టు 20 నాటికి ఆమె వీసా గడువు ముగుస్తుందని, ఆ లోగా ఇండియా వెళ్లిపోతుందని పేర్కొన్నాడు.

More Telugu News