హైదరాబాదులో డివైడర్ ను ఢీ కొట్టిన అంబులెన్స్.. మంటలు చెలరేగి డ్రైవర్ మృతి..
- డివైడర్ ను ఢీ కొట్టడంతో చెలరేగిన మంటలు
- మంగళవారం తెల్లవారుజామున వనస్థలిపురంలో ప్రమాదం
- పూర్తిగా కాలిపోయిన అంబులెన్స్
మలక్ పేటకు చెందిన ఓ ప్రైవేట్ అంబులెన్స్ ఇబ్రహీంపట్నం వెళ్లి తిరిగి వస్తోంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి పేషెంట్ ను తీసుకెళ్లి దింపేసి తిరిగి వస్తుండగా హస్తినాపురం వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని డ్రైవర్ ను బయటకు తీశారు. అయితే, తీవ్రగాయాలు, రక్తస్రావం కారణంగా డ్రైవర్ అప్పటికే చనిపోయాడు. అంబులెన్స్ ను పక్కకు జరిపే ప్రయత్నం చేస్తుండగా అందులోని ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అంబులెన్స్ మంటల్లో కాలిపోయింది.