Pakistan: ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ.. భర్తకు షాక్

 Indian woman crosses seema for love goes to Pak to meet Facebook friend
  • పాకిస్థానీ యువకుడితో భారతీయ మహిళ ఫేస్‌బుక్ ప్రేమ
  • జైపూర్ చూడ్డానికి వెళుతున్నానని భర్తకు చెప్పి గడప దాటిన వివాహిత
  • లాహోర్‌లో ఉన్నానంటూ రెండు రోజుల తరువాత భర్తకు ఫోన్ 
  • మహిళను అదుపులోకి తీసుకున్న పాక్ పోలీసులు, 
  • నిబంధనల ప్రకారమే ఆమె పాక్‌లోకి రావడంతో విడుదల
  • ఎటువంటి అవాంఛిత ఘటనలు జరగకుండా ఆ జంటకు పోలీసు భద్రత
భారత్‌లో పాక్ మహిళ సీమా హైదర్ కలకలం సద్దుమణగకమునుపే మరో అంతర్జాతీయ ప్రేమ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈసారి ఓ భారతీయ మహిళ తన ప్రేమికుడిని చూసేందుకు పాకిస్థాన్‌కు వెళ్లింది. తొలుత మహిళను అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు ఆమె డాక్యుమెంట్స్‌ అన్నీ సరిగా ఉండటంతో విడిచిపెట్టారు. 

రాజస్థాన్‌లోని భివండీకి చెందిన అంజూ స్థానికంగా బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త అరవింద్ కూడా ప్రైవేటు ఉద్యోగి. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంజూ సోదరుడితో కలిసి వారు ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. విదేశీ కొలువుల కోసం అరవింద్ అంజూకు 2020లో పాస్‌పోర్టు పొందడంలో సాయపడ్డాడు. అయితే, అంజూకు కొంత కాలం క్రితం ఫేస్‌బుక్‌లో పాక్‌లోని ఖైబర్ పాఖ్‌తూన్‌ఖ్వా ప్రావిన్స్‌కు చెందిన నస్రుల్లాతో పరిచయం ఏర్పడింది. అది వారి మధ్య ప్రేమకు దారితీసింది. 

కాగా, గురువారం అంజూ జైపూర్‌(రాజస్థాన్) చూడ్డానికి వెళుతుతున్నానని భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరోమారు భర్తకు ఫోన్ చేసి తాను లాహోర్‌లో ఉన్నట్టు చెప్పడంతో అతడు ఆశ్చర్యపోయాడు. రెండు మూడు రోజుల్లో తిరిగొస్తానని చెప్పి ఆమె సంభాషణ ముగించింది. అయితే, అంజూ ప్రేమ వ్యవహారం తనకు తెలుసునని అరవింద్ మీడియాకు తెలిపాడు. ఆమె మళ్లీ తన వద్దకు తిరిగొస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు.

More Telugu News

Pakistan
India