కుక్క కరిచిన ఆరు నెలలకు రేబీస్.. బాలుడి దుర్మరణం

  • కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వెలుగు చూసిన ఘటన
  • ఆరు నెలల క్రితం కుక్క కరిచినా భయపడి ఇంట్లో చెప్పని 17 ఏళ్ల బాలుడు
  • మూడు రోజుల క్రితం బాలుడికి తీవ్ర జ్వరం, నీటిని చూసి భయపడిన వైనం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం దుర్మరణం
కుక్క కరిచిన విషయం ఇంట్లో చెబితే తిడతారని భయపడ్డ ఓ బాలుడు ఆరు నెలల తరువాత రేబీస్ సోకడంతో మృతి చెందాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. తేలు ఓంసాయి అనే 17 ఏళ్ల బాలుడిని ఆరు నెలల క్రితం వీధి కుక్క కరిచింది. కానీ అతడు ఇంట్లో చెప్పలేదు. మూడు రోజుల క్రితం అతడికి తీవ్ర జ్వరం వచ్చింది. మంచినీళ్లు తాగలేకపోయిన బాలుడు నీళ్లను చూస్తే భయపడటం ప్రారంభించాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని శనివారం కాకినాడు జీజీహెచ్‌లో చేర్చారు. వ్యాధి ముదరడంతో వైద్యం ఫలించక బాలుడు ఆదివారం మృతిచెందాడు. చేతికంది వస్తాడనుకున్న కొడుకు ఇలా హఠాన్మరణం చెందడంతో బాలుడి కుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది. 

కుక్క కాటుకు గురైన రోజునే యాంటీ రేబీస్ వ్యాక్సిన్‌తో పాటూ టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ తరువాత 3వ రోజు, 7వ రోజు, 28వ రోజు టీకా తీసుకుంటే రేబీస్ వ్యాధి ముప్పు తప్పిపోతుందని చెప్పారు.

Dog bite
Andhra Pradesh
Kakinada

More Telugu News