India-A: ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్: ఫైనల్లో తీవ్రంగా నిరాశపరిచిన ఇండియా-ఏ... విజేత పాకిస్థాన్-ఏ

  • శ్రీలంక వేదికగా ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్
  • ఫైనల్లో  ఇండియా-ఏ వర్సెస్ పాకిస్థాన్-ఏ
  • 128 పరుగుల భారీ తేడాతో ఓడిన యువ భారత్
  • 353 పరుగుల లక్ష్యఛేదనలో 224 పరుగులకే ఆలౌట్
India A team lost to Pakistan A in Emerging Teams Asia Cup Final

యువ ప్రతిభావంతులతో కూడిన ఇండియా-ఏ జట్టు ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీ ఫైనల్లో ఓటమిపాలైంది. పాకిస్థాన్-ఏ జట్టు 128 పరుగుల భారీ తేడాతో ఇండియా-ఏ టీమ్ ను ఓడించింది. 353 పరుగుల భారీ లక్ష్యఛేదనలో యువ భారత జట్టు 40 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్... పాకిస్థాన్ కు బ్యాటింగ్ అప్పగించింది. తయ్యబ్ తాహిర్ (108) విధ్వంసక సెంచరీతో మెరవగా, పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనలో భారత్ కు ఓ మోస్తరు శుభారంభం లభించినా, మిడిలార్డర్ వైఫల్యంతో ఓటమి తప్పలేదు. 

ఓపెనర్లు అభిషేక్ శర్మ 61, సాయి సుదర్శన్ 29 పరుగులు చేశారు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్ అవుటవడంతో ఇండియా-ఏ పతనం ఆరంభమైంది. అక్కడ్నించి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన యువ జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది. కెప్టెన్ యశ్ ధూల్ 39 చేశాడు.

పాకిస్థాన్-ఏ జట్టు బౌలర్లలో సూఫియాన్ ముఖీమ్ 3, అర్షద్ ఇక్బాల్ 2, మెహ్రాన్ ముంతాజ్ 2, మహ్మద్ వాసిం జూనియర్ 2 వికెట్లతో ఇండియా-ఏ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశారు. 

మ్యాచ్ లో చివరి వికెట్ తీశాక పాకిస్థాన్-ఏ ఆటగాళ్ల సంబరాలు మామూలు స్థాయిలో లేవు. మైదానంలో సింహనాదాలు చేస్తూ, కోచ్ ను పైకెత్తి ఫుల్ జోష్ ను ప్రదర్శించారు.

More Telugu News