Team India: ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్: టీమిండియా ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచిన పాకిస్థాన్

  • శ్రీలంక వేదికగా యువ జట్ల టోర్నీ
  • నేడు ఫైనల్లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • భారత బౌలింగ్ ను చితకబాదిన పాక్ బ్యాటర్లు
  • తయ్యబ్ తాహిర్ మెరుపు సెంచరీ
  • 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు చేసిన పాక్ 
Pakistan set Team India huge target

శ్రీలంకలో జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత కుర్రాళ్లు అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ యువ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు చేసింది. భారత్ ముందు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. 

ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓపెనర్లు సయీమ్ అయూబ్ (59), సాహిబ్ జాదా ఫర్హాన్ (65) తొలి వికెట్ కు 121 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఈ దశలో భారత్ బౌలర్లు విజృంభించడంతో పాక్ 187 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్టు కనిపించింది. 

కానీ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ తయ్యబ్ తాహిర్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించడమే కాకుండా, పాకిస్థాన్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. తాహిర్ 71 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 భారీ సిక్సులతో విరుచుకుపడి 108 పరుగులు సాధించడం పాక్ ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచింది. 

ఒమర్ యూసఫ్ (35), ముబాసిర్ ఖాన్ (35) రాణించగా, టెయిలెండర్లు మహ్మద్ వాసిం జూనియర్ (17 నాటౌట్), మెహ్రాన్ ముంతాజ్ (13) కూడా తమ వంతు సహకారం అందించడంతో పాకిస్థాన్ స్కోరు 350 మార్కు దాటింది. 

భారత బౌలర్లలో హంగార్కేకర్ 2, రియాన్ పరాగ్ 2, హర్షిత్ రాణా 1, మానవ్ సుతార్ 1, నిషాంత్ సింధు 1 వికెట్ తీశారు.

More Telugu News