Pilli Subhas Chandra Bose: రామచంద్రాపురం వార్: వైసీపీ హైకమాండ్‌కు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అల్టిమేటం

  • మంత్రి వేణుకు టికెట్‌ ఇస్తే సమర్థించబోనన్న పిల్లి సుభాష్
  • ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటన
  • తమ కుటుంబానికి వైసీపీ నాయకత్వం టికెట్ ఇవ్వాలని డిమాండ్
  • పార్టీకి నష్టమైనా సరే క్యాడర్‌‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని వెల్లడి
ysrcp mp pilli subhash key comments

వైసీపీ హైకమాండ్‌కు ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అల్టిమేటం జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను వైసీపీ అభ్యర్థిగా బరిలో దింపితే తాను సమర్ధించబోనని తేల్చిచెప్పారు. పార్టీలో కూడా ఉండబోనని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో  తన కుటుంబం రామచంద్రాపురం నుంచి పోటీ చేయాలని క్యాడర్ కోరుకుంటోందని ఆయన చెప్పారు.

పార్టీకి నష్టమైనా సరే తాను క్యాడర్‌‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. తమ కుటుంబానికి వైసీపీ నాయకత్వం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతామని తేల్చిచెప్పారు.

ఇవాళ మంత్రి చెల్లుబోయిన వేణు వర్గం నిర్వహించిన సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని సుభాష్ చంద్రబోస్ చెప్పారు. చెల్లుబోయినతో కలిసి కూర్చుని మాట్లాడే ప్రసక్తే లేదని సీఎం జగన్‌కు స్పష్టం చేసినట్లు తెలిపారు. ‘‘ఇక్కడ మా క్యాడర్‌‌ను మంత్రి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. అవినీతి రాజ్యమేలుతోంది. క్యాడర్ అంతా అసంతృప్తితో ఉన్నారు. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది” అని అన్నారు. బలం ఉన్నంత సేపే ఇక్కడ గౌరవిస్తారని, క్యాడర్‌‌లో తాను బలహీనపడదల్చుకోలేదని చెప్పారు.

‘‘కార్యకర్తలు, క్యాడర్‌ వద్ద వేణు ఎన్ని రోజులు నటిస్తారు? మమ్మల్ని.. వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌తోనే ఉన్నాం. వేణు, నన్ను సమావేశపరుస్తానని సీఎం జగన్‌ చెప్పారు. క్యారెక్టర్‌ లేని వ్యక్తితో కూర్చోనని తేల్చి చెప్పాను’’ అని పిల్లి సుభాష్‌ తెలిపారు.

More Telugu News