manipur: మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన, ఆరో నిందితుడి అరెస్ట్

  • ఉద్రిక్తతలు చెలరేగకుండా రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం
  • మిగతా నిందితులను పట్టుకోవడానికి పోలీసుల ప్రయత్నం
  • ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న ముఖ్యమంత్రి
Manipur Police make sixth arrest in viral video case

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి మణిపూర్ పోలీసులు ఆరో నిందితుడిని అరెస్ట్ చేశారు. 'శనివారం మరో నిందితుడు అరెస్టయ్యాడు. ఐదుగురు ప్రధాన నిందితులు, ఒక జువెనైల్‌తో సహా మొత్తం ఆరుగురు అరెస్టయ్యారు' అని మణిపూర్ పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు.

మరోవైపు, ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగకుండా మణిపూర్ పోలీసులు, కేంద్రబలగాలతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు అనుమానిత స్థావరాలపై దాడులు నిర్వహించి మిగతా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మే 4న ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన గుంపుకు చెందిన అరెస్టైన నలుగురు నిందితులను 11 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చారు.

ప్రతిపక్షం పార్లమెంటు ఉభయ సభలలో ఈ అంశాన్ని లేవనెత్తింది. మణిపూర్ ఉదంతంపై ఉభయసభలు వరుసగా రెండో రోజు వాయిదా వేయవలసి వచ్చింది. 

పెద్ద ఎత్తున తరలి వెళ్లిన మహిళలు ఈ కేసులో ప్రధాన నిందితుడి ఇంటిని తగులబెట్టినట్లు శుక్రవారం స్థానిక మీడియా పేర్కొంది. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడం, మహిళల్ని నగ్నంగా ఊరేగించిన నిందితులను చట్టపరంగా శిక్షించడం తమ ముందు ఉన్న కర్తవ్యమని ప్రభుత్వం చెబుతోంది. దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని మణిపూర్ సీఎం అన్నారు. వీడియో వెలుగులోకి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరూ ఎంతో ఆగ్రహంతో ఉన్నారని, మన సమాజంలో మహిళలందరినీ తల్లులు, సోదరీమణులుగా చూస్తామని, అలాంటి భూమిలో ఈ ఘటన దారుణమని, అందుకే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

More Telugu News