Rajasthan: నిజం చెప్పినందుకు శిక్షించారు.. బతికినంత కాలం ఇలాగే మాట్లాడుతా: రాజస్తాన్ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన రాజేంద్ర సింగ్

  • రాజస్థాన్‌లో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయన్న మంత్రి రాజేంద్రకు ఉద్వాసన
  • జైలుకు పంపించినా ఇలాగే మాట్లాడుతానని వ్యాఖ్య
  • ప్రజలు తనతోనే ఉంటారని వెల్లడి 
I speak the truth always I got punished for speaking the truth Rajendra Singh Gudha

తాను ఎప్పుడూ నిజమే చెబుతానని, రాజస్థాన్ లో జరుగుతున్న వాస్తవాన్ని నిన్న తాను చెప్పిందుకే తనకు శిక్ష విధించారని మంత్రి పదవి నుండి తొలగించబడిన రాజేంద్ర సింగ్ గుడా అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు తనతోనే ఉంటారని, తాను అదే ప్రజల కోసం పని చేస్తానన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనను మంత్రివర్గం నుండి తొలగించినా లేదా జైలుకు పంపించినా... తాను జీవించి ఉన్నంత వరకు ఇలాగే మాట్లాడుతూనే ఉంటానన్నారు.

రాజస్థాన్‌లో మహిళలకు భద్రత లేదని, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలలో ఈ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏదైనా చేయాలని తాను సీఎం అశోక్ గెహ్లాట్ ను కోరాలనుకుంటున్నానని చెప్పారు.

మణిపూర్ లో మహిళల అర్ధనగ్న ప్రదర్శన సంఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సమయంలో రాజస్థాన్ మంత్రిగా ఉన్న రాజేంద్ర సింగ్ గుడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... రాజస్థాన్ లో మహిళలపై జరుగుతున్న నేరాల కట్టడికి మన ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇక్కడ కఠిన వాస్తవం ఏమంటే మన ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతోందని, రాజస్థాన్ లో మహిళలపై అకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి మణిపూర్ అంశంపై మాట్లాడటానికి బదులు తన సహచరులు మొదట మన రాజస్థాన్ సంగతి చూడాలన్నారు.

రాజేంద్ర సింగ్ గుడా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగా ఉన్నారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో అశోక్ గెహ్లాట్ ఆయనను మంత్రి వర్గం నుండి తొలగిస్తున్నట్లు రాజ్ భవన్ కు సిఫార్స్ పంపించారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రా వెంటనే ఆమోదం తెలిపారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన గంటల్లోనే ఉద్వాసన ప్రక్రియ జరిగిపోయింది.

More Telugu News