Rajasthan: సొంత ప్రభుత్వంపై విమర్శలు.. రాజస్థాన్ మంత్రిపై సీఎం గెహ్లాట్ వేటు

  • మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలమైందన్న మంత్రి
  • అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి వ్యాఖ్యలు
  • పదవి నుంచి తప్పించి షాక్ ఇచ్చిన ప్రభుత్వం
Rajasthan minister sacked for questioning own government on women safety

సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేసిన మంత్రికి రాజస్థాన్ సర్కారు షాక్ ఇచ్చింది. పదవి నుంచి తప్పిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంత్రిగా పలు శాఖల బాధ్యతలు చూస్తున్న రాజేంద్ర గుధా తన పదవిని కోల్పోయారు. శుక్రవారం అసెంబ్లీలో మంత్రి రాజేంద్ర చేసిన వ్యాఖ్యలే ఆయన పదవికి ఎసరు పెట్టాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అసలేం జరిగిందంటే..
రాజస్థాన్ అసెంబ్లీలో ప్రభుత్వం మినిమం ఇన్ కం గ్యారంటీ బిల్ 2023 ను ప్రవేశపెట్టింది. శుక్రవారం దీనిపై సభలో చర్చ జరుగుతుండగా.. అధికార పార్టీ కాంగ్రెస్ సభ్యులు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి రాజేంద్ర మాట్లాడుతూ.. రాజస్థాన్ లో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. మణిపూర్ లో మహిళల వేధింపుల ఘటనల సంగతి తర్వాత ముందు మన రాష్ట్రంలో మహిళల రక్షణ విషయం ఆలోచించాలని సభ్యులను కోరారు. సొంత ప్రభుత్వంపై మంత్రి విమర్శలు చేయడంతో రాజేంద్రను పదవి నుంచి తప్పిస్తూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వేటు వేశారు. 

More Telugu News